నెల్లూరు జిల్లా కావలిలో కరకు ఖాకీ తన ప్రతాపాన్ని ఇద్దరు యువకులపై చూపించాడు. ఇద్దరు యువకులు ఎలాంటి నేరం చేయకపోయినా కూడా వారిని చిత్రహింసలు పెట్టాడు.
కావలిలో అక్కడి యువకులు అందరూ కలిసి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని రోజూ పూజలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఒకరో ఇద్దరో యువకులు ఆ విగ్రహం వద్ద నిద్రిస్తారు. అదే విధంగా శివ, శ్రీను అనే ఇద్దరు యువకులు గత రాత్రి అక్కడ నిద్రించేందుకు వెళ్లారు.
పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లి టిఫిన్ తెచ్చుకుందామనుకున్నారు. ఆ ఇద్దరు యువకులు అక్కడకు వెళ్లి టిఫిన్ తీసుకుంటుండగా శాడిస్టు ఖాకీ అక్కడకు వచ్చాడు. వారిపై విచక్షణా రహితంగా లాఠీ ప్రయోగించాడు. ఎందుకు కొడుతున్నాడో కూడా చెప్పకుండా చితక్కొట్టాడు.
అక్కడే పడిపోయిన ఇద్దరు యువకుల్లో ఒకరు మిగిలిన స్నేహితులకు చెప్పగా వారు వచ్చి కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో వారిద్దరిని చేర్చారు. శివ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదీ ఖాకీల కర్కశత్వం. ఈ పని చేసిన ప్రబుద్ధుడు కావలి ఒన్ టౌన్ యస్.ఐ.