అధికార మదంతో బీజేపీ కార్యకర్తల్ని పోలీసు బూటు కాళ్లతో తొక్కించిన వైసీపీ అథ:పాతాళానికి పడిపోవడం ఖాయమని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నెల్లూరులో పోలీసులు చేసిన బాధ్యతారహిత సంఘటనపై ఆయన తీవ్రమైన ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య నిరసనలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు జీవో 1ని కొట్టేసి క్షణాలు కాక ముందే ఏపీ పోలీసులు అరాచకానికి పాల్పడ్డారని ఆయన అన్నారు.
ఇక్కడ ఏపీ పోలీసుల కాళ్ల మధ్య నలిగిపోతోంది బీజేపీ కార్యకర్త మాత్రమే కాదు ప్రజాస్వామ్యం కూడా. మానవత్వం మరిచి రాజభక్తిని ప్రదర్శిస్తున్న ఏపీ పోలీసు వ్యవస్థ అమానవీయతకు సాక్ష్యం ఈ దృశ్యం. ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపడం కూడా తప్పేనా ? ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని పదుల సంఖ్యలో పోలీసులు బీజేపీ నేతలపై దాడి చేస్తారా? కాళ్లతో తొక్కి హేయంగా ప్రవర్తిస్తారా ? అని ప్రశ్నించారు. పోలీసులతో కలసి విపక్షాలను అణిచివేసిన ప్రభత్వాలన్నీ అడ్రస్ లేకుండా పోయాయి.
వైసీపీ పాలనకూ అదే గతి పట్టనుందని హెచ్చరిస్తున్నామని ఆయన అన్నారు. హోంమంత్రి వెంటనే ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రజతో కలసి ప్రజా ఉద్యమంతో బీజేపి సమాధానం చెబుతుందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.