పెళ్లి చేసుకుంటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా అంటే కుదరదు గాక కుదరదు. రెండు వందల మంది అతిధులు దాటితే పెళ్లి చేసుకున్న మీకు, పెళ్లి చేసుకోవడానికి అద్దెకు ఇచ్చిన మ్యారేజీ హాల్ వారికి ఫైన్ తప్పదు. ఇదంతా కరోనా ఎఫెక్టు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా వినకుండా ప్రవర్తించిన మ్యారేజీ హాల్స్ ను పోలీసులు బుక్ చేస్తున్నారు.
ఫైన్ వేస్తున్నారు. తాళాలు వేసేస్తున్నారు. ఇలా నిర్మల్ పట్టణ పోలీసులు నేడు మూడు మ్యారేజి హాల్స్ ను బుక్ చేశారు. నిర్మల్ పట్టణంలోని శ్రీ రాజా రాజేశ్వర ఫంక్షన్ హాల్, ఆర్ఆర్ గార్డెన్, (విశ్వనాథ్ పేట)లను పోలీసులు లాక్ చేసేశారు. ఎవరు పెళ్లి హాల్ బుక్ చేశారో వారిని కేసులో ద్వితీయ ముద్దాయిగా పెట్టేశారు.
అలా పెళ్లికూతురు తండ్రి ఏ2 అయ్యాడు. మ్యారేజి హాల్ ఇచ్చిన హాల్ మేనేజర్ ప్రధమ ముద్దాయి అన్నమాట. అంటే ఏ వన్. అదే విధంగా సాగర్ కన్వెన్షన్ హాల్ పై కూడా కేసులు బుక్ అయ్యాయి. ఖానాపూర్ లోని AMK ఫంక్షన్ హాల్ కు సీల్ చేశారు.
పెళ్లిలో 200 మంది కి మించిన అతిధులు ఉన్న ప్రతి పెళ్లి పైనా కేసు గ్యారెంటీ అని పోలీసులు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా cr.no.16 / 2020 u / s 271,188 r / w 34 IPC మరియు విపత్తు నిర్వహణ చట్టం 2005 యొక్క సెకను 51 లో కేసు నమోదు చేసినట్లు సోన్ ఎస్ ఐ తెలిపారు.