రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగిస్తూ అసత్య వార్త ప్రచురించిన సాక్షి పత్రిక KPHB కాలనీ విలేకరి మామిడాల రవీందర్ రెడ్డి పై హైదరాబాద్ లోని KPHB పొలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కోర్టులో కనీసం విచారణ కూడా జరగకమునుపే వ్యక్తిగత హక్కులకు, పరువు ప్రతిష్టలకు భంగం కలుగజేస్తూ సాక్షి పత్రికలో తనపై వార్త ప్రచురించడంపై సీనియర్ జర్నలిస్టు భూమి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.
ఆయన ఫిర్యాదు మేరకు నిజానిజాలను పరిశీలించిన న్యాయమూర్తి సాక్షి పత్రిక విలేకరి రవీందర్ రెడ్డి, ఎడిటర్ వర్ధెల్లి మురళితోపాటు జగతి పబ్లికేషన్స్ పైనా కేసు నమోదు చేయాలని సైబరాబాద్ పరిధిలోని KPHB పోలీసులను ఆదేశించారు. ఆ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదివరకు కూడా శ్రీనివాసరెడ్డి తనకు సంబంధం లేని విషయంలో పోలీసులు కొందరి మన్ననలు పొందేందుకు తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పుడు కూడా న్యాయస్థానం సంబంధిత పోలీసు అధికారులను గట్టిగా మందలించింది.
వివరణ అయినా తీసుకోవాలి కదా
ఒకరి హక్కులకు భంగం కలిగించే వార్త ప్రచురించే ముందు నిజానిజాలు విచారించాలని, కనీసం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వివరణ అయినా తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి అన్నారు. అసత్య వార్తల్ని ప్రచురించటం విలేకరులకు తగదన్నారు. ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా, వ్యక్తుల గోప్యతకు భంగం వాటిల్లకుండా పత్రికలు తమ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. కొందరు ప్రజా ప్రతి నిధులను తప్పు దారి పట్టించి అక్రమ కేసుల్లో ఇరికించి తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అనీ ఆరోపించారు.