జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని సాయుధ బలగాల కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముందుగా విధి నిర్వహణలో అమరులయిన పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడూతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారని, పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారు చేసిన త్యాగాలను మనం గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించటం అనేది మనకు 1959 నుంచి సాంప్రదాయంగా వస్తోందని చెప్పారు.
అనంతరం జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను దేశం మరిచిపోదని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా గద్వాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విధినిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు గద్వాల్ పోలీసులు జోహార్లు అర్పించారు.
ఈ కార్యక్రమంలో గద్వాల్, అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్లు, రాష్ట్ర పంచాయతిరాజ్ ట్రిబ్యునల్ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా అదనపు ఎస్పీ కే.కృష్ణ, గద్వాల్ డిఎస్పీ యాదగిరి, గద్వాల్, శాంతినగర్, అలంపూర్ సీఐ జక్కుల హన్మంతు, వెంకటేశ్వర్లు, వెంకటరామయ్య, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.