ట్రాఫిక్ నియమ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఖమ్మం నగర ట్రాఫిక్ సిఐ అంజలి అన్నారు. ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన మద్యం మత్తులో రోడ్లపై వాహనాలు నడుపుతున్న వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కమాండ్ కంట్రోల్ లోని ట్రాఫిక్ కౌన్సిలింగ్ సెంటర్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే దుష్ఫలితాలను తెలియజేశారు.
ప్రతిరోజు నగరంతో పాటు బైపాస్ రోడ్డుపైన నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి నిబంధనలు పాటించేలా వారికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వీటితో పాటుగా ఈ హైవేపైనే రోడ్డు పక్కన ఉన్న జంక్షన్లను సులభంగా గుర్తించడానికి బ్లింకర్స్ను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలకు ప్రత్యేకంగా స్టిక్కర్లను అతికించి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని, పత్రాలు సరిగ్గా ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా, ఆటోలో లౌడ్స్పీకర్స్ను నిషేధించాలని, తప్పనసరిగ్గా ఇన్సురెన్స్ సదుపాయం కలిగిఉండాలని, వేగంగా ప్రయణించడం వలన కలిగే నష్టాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితో పాటు రోడ్డు పక్కన పండ్లు అమ్ముకునే వారికి, చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారికీ కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.
హెల్మెట్ వాడకంపై విస్తృతంగా ప్రచారం చేస్తూ…ద్విచక్ర వాహనాదారులు హెల్మెట్ ధరించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలియజేసేందుకు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించి ద్విచక్రవాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలకు హెల్మెట్ వాడకం తప్పనిసరి అని వివరిస్తున్నారు.
రహదారిపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు పాటించాల్సిన నిబంధనలు, పాదాచారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి పాఠశాల, కళాశాలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రోజు రోడ్డుపైన వాహనాలను నిలపొద్దని ప్రచారం చేస్తూ రాంగ్ పార్కింగ్ చేసిన వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించి నిబంధనల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారని అన్నారు.