తెలంగాణా పోలీస్ శాఖ ఆధ్వర్యం లో నిర్వహించే ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐ.ఐ.టీ.సి) ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 37 పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ నేడు అట్టహాసంగా జరిగింది. మొయినాబాద్ లోని జాగిలాల శిక్షణా కేంద్రం లో నిర్వహించిన ఈ పాసింగ్ అవుట్ పరేడ్ కు ఇంటలిజెన్స్ ఐజీ నవీన్ చంద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
సి.ఐ.ఎస్.ఎఫ్ డైరెక్టర్, అడిషనల్ డీజీ సీవీ ఆనంద్, ఐజీ సెక్యూరిటీ ఎం.కె.సింగ్, శిక్షణా సంస్థ ప్రిన్సిపాల్ తాజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ నవీన్ చంద్ మాట్లాడుతూ, 16 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ ఏ.ఐ.టీ.సి లో ఇప్పటివరకు 885 శునకాలకు ప్రత్యేకమైన కఠోర దీక్ష తో శిక్షణ ను అంద చేశామని తెలిపారు.
హైదరాబాద్ లోని ఈ జాగిలాల శిక్షణా కేంద్రం దేశంలోని అత్యుత్తమ శిక్షణా కేంద్రాలలో ఒకటని వెల్లడించారు. రాష్ట్రం లోని ఎన్నో కీలక కేసులను ఛేదించడం లో పోలీస్ జాగిలాలు అందించిన సేవలు అమోఘమని ప్రశంసించారు. సెక్యూరిటీ విభాగం ఐజీ ఎంకే సింగ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ శిక్షణా కేంద్రం నుండి 19 బ్యాచ్ ల శిక్షణ పొందిన శునకాల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగిందని తెలిపారు.
విద్రోహ నివారణ, పేలుడు పదార్థాల గుర్తింపు, ప్రమాదకర ప్రాంతాలకు చేరుకోవడం, వీఐపీ ల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ జాగిలాలు అత్యంత కీలకపాత్ర వహిస్తున్నాయని పేర్కొన్నారు, మొయినాబాద్ లోని శిక్షణా కేంద్రం లో కేవలం తెలంగాణా రాష్ట్రానికి చెందిన శునకాలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల పోలీస్ శాఖలకు చెందిన శునకాలకు కూడా శిక్షణా నిస్తున్నామని అన్నారు.
ఇటీవలే బీహార్ రాష్ట్రానికి చెందిన 20 జాగిలాలకు అక్రమ మద్యం గుర్తించే విధంగా ప్రత్యేక శిక్షణా నిచ్చామని తెలిపారు. మరో 25 శునకాలకు కూడా శిక్షణా నివ్వాలని బీహార్ పోలీస్ శాఖ కోరిందని తెలియచేసారు. ఈ సందర్బంగా పాసింగ్ ఔట్ పరేడ్ కు హాజరైన అధికారులు శిక్షణా పొందిన జాగిలాలు వందన పరేడ్ స్వీకరించారు.
శిక్షణా పొందిన జాగిలాలు ప్రదర్శించిన సాహాస కృత్యాలు ఆకట్టుకున్నాయి. శిక్షణా పొందిన జాగిలాలు ఇతరులు పెట్టిన ఆహారాన్ని స్వీకరించక పోవడం,కేవలం తన శిక్షకుడు ఇచ్చే ఆహారాన్నే తినడం, పేలుడు పదార్థాలను వాసన తోనే గుర్తించడం, ఎన్నో బాక్సలున్నా ఒకే దానిలో ఉన్నబాంబుల గుర్తింపు, అంధులను రోడ్డు దాటించడం, ప్రమాదకర పరిస్తితుల్లోనూ ఉగ్రవాదులను పట్టుకోవడం లాంటి విన్యాసాలు చేశాయి.
కేవలం తాడు పైనుండి వెళ్లి ఎత్తుపైనుండి దూకి విద్రోహస్థావరాలకు వెళ్లడం, మంటల నుండి, నీళ్ళనుండి దూకడం తదితర విన్యాసాలను జాగిలాలు ప్రదర్శించాయి. ఈ సందర్బంగా ఉత్తమ శిక్షణ పొందిన శునకాలకు, వాటి శిక్షకులకు మెడల్స్, ప్రశంశాపత్రాలు అందచేశారు.