ఎక్కడైనా నేరం జరిగినా, దొంగలను పట్టుకోవాలన్నా…వాళ్ల ఆచూకీ కనిపెట్టేందుకు సంఘటనా స్థలానికి పోలీసుల కంటే ముందే చేరుకుంటాయి…జాగిలాలు.
వాటి పనితీరు ఎలావుందో పోలీసులు అప్పుడప్పుడు పరిశీలిస్తుంటారు. ఆ విధంగా ఏపీలోని విజయనగరం జిల్లాలో పోలీసు శాఖలోగల పోలీసు జాగిలాల పనితీరు, ఆరోగ్యాలను ఐఎస్ డబ్ల్యు అధికారులు పోలీసు పరేడ్ గ్రౌండులో పర్యవేక్షించారు.
ఇంటిలిజెన్సు సెక్యూరిటీ విభాగం చీఫ్ టి.వి. శవిధర్ రెడ్డి ఉత్తర్వులు మేరకు విజయవాడ ఐఎస్ డబ్ల్యు అధికారుల బృందం విజయనగరం జిల్లాకు డిశెంబరు 2న చేరుకొని, పోలీసు జాగిలాల ఆరోగ్యం, పని తీరును వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు.
నేర స్థలం నుండి పరారైన నిందితులను పట్టుకోవడంలోను, ఎక్స్ ప్లోజివ్ మెటిరియల్ ను గుర్తించడంలోను పోలీసు జాగిలాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా, విఐపిల భద్రతలో పోలీసు జాగిలాలు కీలకపాత్ర పోషిస్తూ, విఐపిలు సందర్శించే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు, అనుమానితులను, అనుమానస్పద వ్యక్తులను గుర్తించుటలో ఉపయోగ పడుతున్నాయి.
ఇటువంటి జాగిలాల పనితీరును, ఆరోగ్యంను ఉన్నతాధికారుల ఆదేశాలతో వెటర్నటీ డాక్టరు, ఐఎస్ డబ్ల్యు అధికారులు ప్రతీ ఏడాది పరిశీలిస్తుంటారు. ఇందులో భాగంగా, విజయవాడ ఐఎస్ డబ్ల్యు విభాగం ఆ టి.ఎన్.శ్రీనివాసరావు, వెటర్నరీ డాక్టరు ఎస్. ప్రతాప్ లు, హెచ్ సి జి. రామచంద్రారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకొని, పోలీసు జాగిలాలు వీనా, రాఖీ, డైనా, రియా, రుబీ, డాలీ, ట్రాకర్స్ బిందూ, శ్యాండీల పనితీరును పర్యవేక్షించి, వాటి ఆరోగ్యాలను పరీక్షించి, సంతృప్తిని వ్యక్తం చేసారు.
పోలీసు జాగిలాల ఆరోగ్యం గురించి డాగ్ హ్యాండలర్స్ తీసుకొంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం, డాగ్ స్క్వాడ్ విభాగం రికార్డులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పశు వైద్యులు డా. ఎస్. ప్రతాప్, ఐఎస్ డబ్ల్యు ఆర్ ఐ టి.ఎన్. శ్రీనివాసరావు, హెచ్ సి జి. రామచంద్రా రెడ్డి, ఆర్ఎ పి. ఈశ్వరరావు డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.