8 నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ ఇటీవలే హైదరాబాద్ మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ ( ఐఐటిఏ) లో జరిగింది.
ఇందులో అదిలాబాద్ జిల్లాకు చెందిన రెండు జాగిలాలకు పర్యవేక్షకులుగా వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ పసుపుల రమేష్, కానిస్టేబుళ్ళు జె. విద్యాసాగర్, డి భూమన్న లకు మత్తుపదార్థాలను గుర్తించడానికి (రోమా) జాగిలం, పేలుడు పదార్థాలు గుర్తించడానికి (గొల్డీ) పేరు గల రెండు జగిలాలను కేటాయించారు.
ముగ్గురు కలిసి రెండు జాగిలాలతో 8 నెలల పాటు చిత్తశుద్ధితో శిక్షణ పూర్తిచేసుకుని అనంతరం పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇటీవలే పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా రాష్ట్ర పోలీస్ డిజిపి డాక్టర్ ఎం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు.
గురువారం ఆదిలాబాద్ లోని ఎస్ పి క్యాంపు కార్యాలయంలో నూతన జాగిలల్ని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ కు పరిచయం చేశారు, ఈ సందర్భంగా నూతన జాగిలాలు జిల్లా ఎస్పి కి సెల్యూట్ చేసి షేక్ హ్యాండ్ అందించాయి. నూతన జాగిలాలను చూసి జిల్లా ఎస్పీ సంతోషంతో కాసేపు వాటితో గడిపారు.
అల్లారు ముద్దుగా ఉన్న రెండు జాగిలాలను తాకుతూ వాటి శక్తి సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దాచిపెట్టిన పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాలను గుర్తించడం సులభమవుతుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లాలో పోలీసు జాగిలాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
ఉగ్రవాదం, తీవ్రవాదం నిర్మూలనతోపాటు ప్రముఖుల భద్రత వంటి అనేక అంశాల్లో జాగిలాలు ముఖ్య భూమిక నిర్వహిస్తున్నాయన్నారు. ఎలాంటి విపత్తు పరిస్థితుల్లో సైతం లక్ష్యాన్ని చేరుకోవడంలో జాగిలాల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు.
ప్రతిరోజు పరేడ్ మైదానంలో జాగిలాల శక్తిసామర్థ్యాలను పదును పెడుతూ ఉండాలని సూచించారు. హెడ్ కానిస్టేబుల్ పసుపుల రమేష్ ఆధ్వర్యంలో జిల్లాలో డాగ్ స్క్వాడ్ బృందం ఆరోగ్యంగా, శక్తి సామర్థ్యాలతో అద్భుతంగా పనిచేస్తుందని అభినందించారు,
ఈ కార్యక్రమంలో ఓఎస్డి ఎం. రాజేష్ చంద్ర, అదనపు ఎస్పీ బి.వినోద్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఓ. సుధాకర్ రావు, గడి కొప్పుల వేణు, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుల్ పసుపుల రమేష్, కానిస్టేబుళ్ళు జె విద్యాసాగర్, డి భూమన్న, తదితరులు పాల్గొన్నారు.