రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నల్లగొండ జిల్లాలోని పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడకుండా కాపాడడం లక్ష్యంగా అనారోగ్య సమస్యలు, జబ్బులు ఉన్న సిబ్బంది 15 రోజుల పాటు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఎస్పీ ఏ.వి. రంగనాధ్ స్పష్టం చేశారు.
సోమవారం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, డిపిఓ సిబ్బంది, హోమ్ గార్డులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న వారికి కరోనా సోకితే రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్న వారు తట్టుకొని నిలబడే పరిస్థితి ఉంటుందని, అదే సమయంలో షుగర్, బి.పి., మూత్రపిండాల సమస్యలు, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలున్న వారికి త్వరగా కరోనా సోకే అవకాశం ఉన్నదని అందువల్ల పోలీస్ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు విధులకు రావద్దు
డిజిపి ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వివిధ రకాల జబ్బులు ఉన్న వారు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అనారోగ్య సమస్యలు, జబ్బులున్న వారు ఎవరైనా విధి నిర్వహణలో ఉండి కరోనా బారిన పడినట్లుగా తమ దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
జిల్లా పోలీసు శాఖలోని అన్ని విభాగాలకు ఇది వరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీనిని అమలు చేయడం కోసం మొత్తం సిబ్బందికి సంబంధించిన సమాచారం పోలీస్ స్టేషన్ వారీగా రేపటి నుండి రాబోయే 15 రోజుల పాటు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపారు.
పోలీసుల ప్రాణాలు కాపాడటమే ప్రధాన లక్ష్యం
ఈ సమయంలో వారి జీతంలో ఎలాంటి కోతలు ఉండవని, అలాంటి వారి ప్రాణాలు కాపాడడం, కరోనా బారిన పడకుండా రక్షించడం లక్ష్యంగా పెయిడ్ హాలిడేగా పరిగణిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ విధానం అమలు చేయడంతో పాటు ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించుకొని తిరిగి విధులలోకి తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
అయితే సిబ్బందికి పెయిడ్ హాలిడే వల్ల కొంత పనివత్తిడి పెరిగినా సిబ్బంది కరోనా బారిన పడకుండా చూడడమే ప్రధాన ధ్యేయంగా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. అదే సమయంలో అనారోగ్య సమస్యలున్న సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం ఇచ్చిన క్రమంలో జబ్బులు, అనారోగ్య సమస్యలున్న సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగవద్దని ఆయన సూచించారు.
పటిష్టమైన ఆరోగ్య రక్షణకు చర్యలు
50 సంవత్సరాలు దాటిన వారు పూర్తి ఆరోగ్యంతో ఉంటేనే వారిని విధులకు తీసుకోవాలని స్పష్టం చేశారు. సిబ్బంది అందరూ కరోనా బారిన పడకుండా ఉండేలా తీసుకుంటున్న చర్యలలో భాగంగా వీటన్నింటిని పోలీస్ శాఖలో అమలు చేస్తున్నామని చెప్పారు. పోలీస్ శాఖలో ఏ ఒక్కరూ కరోనాతో చనిపోవద్దనే లక్ష్యంతోనే పోలీస్ దీనిని అమలు చేస్తున్నట్లు ఎస్పీ రంగనాధ్ వివరించారు. సెట్ కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ సి.నర్మద, ఎస్.బి. డిఎస్పీ రమణా రెడ్డి, సిఐలు ప్రభాకర్ రెడ్డి, సురేష్ కుమార్, రవీందర్, అంజయ్య తదితరులున్నారు.