ఏదైనా కేసు దర్యాప్తు చేయడం పోలీసుల కర్తవ్యం. అయితే కడప జిల్లా చిన్న మండెం పోలీసులు మాత్రం తమ బాధ్యతను ఒక ప్రయివేటు వ్యక్తిపైన పడేశారు. అదెలా అంటారా? కడప జిల్లా చిన్నమండెం మండలం కేశాపురం గ్రామం దేవలంపేటకు చెందిన మూగి రెడ్డెప్ప అనే వ్యక్తి తనకు భూమి కేటాయింపు కోసమై చిన్నమండెం తహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చాడు.
సర్వే నెంబరు 16/48-3లోని 1.26 ఎకరాల అసైన్డ్ భూమిని తనకు కేటాయించాలని కోరుతూ దరఖాస్తుతో పాటు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సంతకం ఉన్న రెఫరెన్సు లెటర్ ను కూడా ఎమ్మార్వోకు అందజేశాడు. అయితే సదరు మంత్రి సంతకం చేసిన లెటర్ ను ఎమ్మార్వో స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి అందజేయగా ఆయన దానిని రూఢీ చేసుకునేందుకు మంత్రి అనితకు ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది.
దీంతో ఛీప్ విప్, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సదరు ఫోర్జరీ చేసిన లెటర్ ను జిల్లా కలెక్టర్ కు పంపించారు. దీంతో విచారణ చేపట్టిన జిల్లా రెవెన్యూ యంత్రాంతం మూగి రెడ్డిప్పను అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఎమ్మార్వోకు ఆదేశాలు జారీచేశారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు చిన్నమండెం పోలీసులు మూగి రెడ్డెప్పను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కడప జిల్లా చిన్నమండెం లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి? రెడ్డెప్పను విచారించి వివరాలు తెలుసుకోవాలి. అయితే వారు ఆ పని చేయకుండా బొగ్గుల కిరణ్ అనే వ్యక్తి ని పట్టుకొచ్చారు. తమదైన శైలిలో అంటే తెలుసుగా… అలా అతడిని ప్రశ్నించారు.
అతను ఏం చెప్పాడో తెలియలేదు కానీ అతను మాత్రం తనను పోలీసులు వేధిస్తున్నారని సూపర్ వాస్మాల్ తాగేశాడు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక తన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడని ఆయన భార్య కృష్ణవేణి అంటున్నారు. రాయచోటి లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిరణ్ చికిత్స పొందుతున్నాడు.
మంత్రి తానేటి వనిత లెటర్ ప్యాడ్, సంతకాన్ని ఫోర్జరీ చేసిన రెడ్డెప్ప అనే వ్యక్తి కి సహకరించాడా లేదా అని తన భర్తను పోలీసులు వేధిస్తున్నారని కృష్ణవేణి చెబుతున్నారు. పోలీసులూ ఇదేం పని?