అదేమిటి పోలీసు అధికారి అయి ఉండి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అందరి పోలీసుల్లా కాకుండా నాగర్ కర్నూల్ ఎస్పి డాక్టర్ వై.సాయి శేఖర్ ప్రత్యేకంగా ఉంటారు. ఆయన ప్రజలతో మాట్లాడే సమయంలో వ్యవసాయం గురించి ఎక్కువగా చెబుతుంటారు. నీతిగా నిజాయితీగా ఎలా బతకాలో చెబుతుంటారు.
నూతన సంవత్సరం సందర్భంగా ఆయన నాగర్న్ కర్నూర్ ప్రజలకు ఇదే తీరుగా వివరించారు. కలుషిత ఆహారం తీసుకోకుండా, రసాయనిక మందులు వాడకుండా, క్యాన్సర్ వ్యాధులకు గురికాకుండా, ప్రకృతి పరిరక్షణ చేస్తూ, సేంద్రియ వ్యవసాయాన్ని వినియోగిస్తూ, ఆరోగ్యవంతంగా ఉంటూ, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నూతన సంవత్సర సందేశాన్ని ఆయన అందించారు.
విలువలతో కూడిన వ్యవస్థ నిర్మించడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారని చెబుతూ, వ్యవసాయం, వాటి ఉత్పత్తుల గురించి వివరించారు. రసాయనిక మందులు వాడటం వలన క్యాన్సర్ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నది కాబట్టి జీవామృతం తయారీ విధానం తెలుసుకొని పంటలకు వాడాలని చెప్పారు.
దీనివల్ల ప్రజలందరూ కలుషిత ఆహారం తీసుకోకుండా ఉంటారని ఆయన అన్నారు. ప్రకృతి పరిరక్షణ చేస్తూ ప్రతి ఒక్కరూ సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించాలని ఆయన కోరారు. పండ్ల తోటలు పెంచి, మానవ శరీరానికి అవసరమైన ఆహారాకన్ని తీసుకుంటూ, ఆరోగ్యవంతంగా ఉంటూ, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని తెలిపారు. దేశంలో హైబ్రిడ్ విత్తానాల వలన ఎలాంటి ఉపయోగాలు లేవని, దేవుడు ఇచ్చిన దేశీయ విత్తనాలను వాడుకుని అధిక దిగుబడి సాధించాలని ఆయన కోరారు.
కోళ్ళు, దేశీయ ఆవులనూ పోషించి గోవు ఆధారిత వ్యవసాయం చెయ్యాలని సూచించారు. తాను ఒక సైంటిస్ట్ గా పరిశోధన చేసిన సందర్బాన్ని గుర్తు చేస్తూ, అప్పుడు చేసిన పరిశోధనలో రసాయనాలు భూమిని పాడు చేస్తాయని, దాని స్థానంలో అక్కడ జీవమృతం వాడితే భూమి లో సుక్ష్మ క్రిములు అభివృద్ది చెంది భూమిని సారవంతం చేస్తుందని తెలిపారు.
అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి మారడం, దుర్గుణాలను తొలగించడం, న్యూ ఇయర్ లో కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది అని ఆయన చెప్పారు. జిల్లా ప్రజలకు, పోలీస్ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజా జీవితంలో ఆరోగ్యవంతంగా ఉంటూ, ప్రజలతో మంచి సానుకూలత కలిగి, లక్ష్యాలను సాధిస్తూ, విలువలతో కూడిన వ్యవస్థ నిర్మించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎస్పీ కోరారు.
2020 ప్రాధాన్యతలు : మహిళలు & పిల్లల భద్రత: 1. బాలికలు, విద్యార్థులు, మహిళా ఉద్యోగులలో ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంచడం 2. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై పోలీసుల నిఘాను మెరుగుపరచడం. రహదారి భద్రత: 1. ట్రాఫిక్ రూల్సు అమలు చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించడం.2. జిల్లా లో హైవే పెట్రోలింగ్ ఎక్కువ చేయడం 3. ప్రయాణ సమయాన్ని క్రమబద్దీకరించడం
4. ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం 5. వ్యవస్థీకృత ట్రాఫిక్, రహదారి భద్రతా మెరుగు చేసుకోవడం. పోలీస్ పబ్లిక్ ఇంటర్ఫేస్ మెరుగుపరచడం: 1. డయల్ -100 ప్రభావాన్ని మెరుగుపరచడం. 2. వివిధ పరిస్థితులకు పోలీసు ప్రతిస్పందన మెరుగుపరచడం.
3. సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలను నివారించడం పై దృష్టి. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ డిఎస్పీ మోహన్ రెడ్డి, డిఎస్పీ గిరిబాబు, నర్సిహ్మలు, ఇన్స్పెక్టర్లు ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు.