అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తున్న అనధికారిక బ్లాస్టింగ్ లు, రిగ్గింగ్ లను నివారించే లక్ష్యంతోనే అందరూ ఉండాలని కృష్ణాజిల్లా పోలీసులు కోరారు.
నేడు నందిగామ సబ్ డివిజన్ పరిధిలోని క్వారి యజమానులు, ఎక్స్ ప్లోజీవ్ డీలర్ లతో పోలీసు అధికారులు సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పి ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందల్, నందిగామ డిఎస్పి నాగేశ్వర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బ్లాస్టింగ్ జరిపే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసిన, చేయకూడని వాటి గురించి అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ క్వారీ యజమానులతో మాట్లాడుతూ బ్లాస్టింగ్ సంబంధించి ప్రభుత్వ ఆదేశాలను, నియమ నిబంధనలను అతిక్రమిస్తే చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
క్వారీ లలో ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి పలు సూచనలు చేశారు. క్వారీ యజమానులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, బ్లాస్టింగ్ చేయుటకు లైసెన్స్ కలిగి ఉన్న వారితో మాత్రమే క్వారీలలో బ్లాస్టింగ్ చేసేపనులు చేపట్టాలని కోరారు.
ప్రేలుడు పదార్ధములను విక్రయించే డీలర్ లు తప్పనిసరిగా లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే అమ్మాలని, క్వారీ యజమానులు, పేలుడు పదార్ధాల డీలర్లు తమ వద్ద పనిచేసే ఉద్యోగులు, కార్మికుల వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా సంబంధిత పోలీసు స్టేషన్ లలో తెలియచేయాలని కోరారు.
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి, లైసెన్స్ రద్దు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ సీఐ కనకారావు , సబ్ డివిజన్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.