శాంతి భద్రతల పరిరక్షణతో పాటు బాధితులకు న్యాయం అందించే అవకాశం ఒక్క పోలీస్ ఉద్యోగం ద్వారానే సాధ్యమని అలాంటి పోలీస్ శాఖలో ఉద్యోగం లభించడం చాలా గొప్ప అవకాశమని డిఐజి, నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ అన్నారు.
శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన డిటిఆర్బీ సిఐ పి. అంజయ్య, ఎస్.ఐ.లు మహ్మాద్ సర్దార్, సి.హెచ్. రవి, ఆర్. లచ్చిరాం, ఏ.ఎస్.ఐ. సి.హెచ్. చెన్నారెడ్డి, డిపిఓ రికార్డ్ అసిస్టెంట్ పి. రాములమ్మలను శాలువాలతో సత్కరించి వారందించిన సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా డిఐజి రంగనాధ్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణలో డిటిఆర్బీ సిఐ అంజయ్య సేవలు అద్వితీయమని అందుకే ఆయన సేవలు మరో సంవత్సరకాలం కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించే దిశగా ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో అందుకు అనుగుణంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
పోలీస్ శాఖ గౌరవం మరింత పెంచాలి
పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు సమాజాభ్యున్నతిలో భాగస్వామ్యం కావడం ద్వారా పోలీస్ శాఖ గౌరవం మరింత పెంచాలని డిఐజి రంగనాధ్ సూచించారు. పదవీ విరమణ పొందుతున్న అధికారుల సేవలు, వారి కృషి కారణంగానే జిల్లాలో అరాచక శక్తులు, నక్సల్స్ ప్రభావం లేకుండా చేయగలిగారని అభినందించారు.
ముఖ్యంగా ప్రతి ఒక్క పదవీ విరమణ పొందిన అధికారి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ సంతోషంగా ఉండాలని సూచించారు. ఏ రంగంలోనైనా కష్టపడి పని చేసినప్పుడే అందుకు తగిన గుర్తింపుతో పాటు ఉన్నత స్థానాలకు చేరుకోగలమన్నారు.
ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. పోలీస్ వృత్తి ద్వారా న్యాయం కోసం ఎదురు చూసే బాధితులకు అండగా నిలిచే అవకాశం కలుగుతుందన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అయితే ఉద్యోగ విరమణ తర్వాత ఖాళీగా ఉండకుండా ఎదో ఒక వ్యాపకంతో సమజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు.
ఎక్కడ ఉన్నా పోలీస్ శాఖ గౌరవాన్ని ప్రజలలో మరింత పెంచడం, ప్రజలకు పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించేలా రిటైర్డ్ పోలీస్ ఉద్యోగులు చూడాలని ఆయన సూచించారు. అదనపు ఎస్పీ నర్మద మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ప్రతి ఉద్యోగి జీవితంలో ఆరోగ్య పరిరక్షణలో ఎక్కువ శ్రద్ధ వహిస్తూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలన్నారు.
ఎదో ఒక వ్యాపాకం పెట్టుకొని సమజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్మద, డిపిఓ ఏ.ఓ. మంజు భార్గవి, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య, పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.