పోలీస్ సిబ్బంది వెనుకడుగు వేయకుండా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ కరోనా వ్యాధి ప్రబలకుండా ముందుండి అప్పటిలో సేవ చేసారని అలాగే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం లో కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ కోరారు.
మన దేశంలో తయారైన వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని ఆయన తెలిపారు. భారతదేశం కరోనా వ్యాక్సిన్ ఇతర దేశాలకు అందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పోలీస్ సిబ్బందికి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేవన్నారు.
వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ప్రజలను కోరారు. గురువారం ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్ లో ఆయన కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా DM&HO ఏ అప్పయ్య, ఎస్ బి ఇన్స్పెక్టర్ రెహమాన్, ములుగు ఎస్సై హరికృష్ణ, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కే.మహేందర్ గౌడ్, సత్యం న్యూస్