పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు పోలీస్ శాఖ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా సమాజ అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు.
శనివారం నల్లగొండ డిఐజి క్యాంపు కార్యాలయంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్ నేతృత్వంలో ఏ.ఆర్. ఎస్.ఐ. శ్రీనివాసులు, ఏ.ఎస్.ఐ. అర్జున్ రెడ్డి లను ఆయన శాలువాలతో సత్కరించి వారి సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా డిఐజి రంగనాధ్ మాట్లాడుతూ పదవీ విరమణ సమయంలో ప్రతి ఉద్యోగికి సంతోషం, బాధ రెండూ ఉంటాయన్నారు. పదవీ విరమణ తర్వాత ఒక కొత్త జీవితం మొదలవుతుందని, ప్రతి ఒక్కరూ ఎదో ఒక వ్యాపకం పెట్టుకోవడం ద్వారా నచ్చిన రంగంలో ముందుకు సాగాలని సూచించారు. పదవీ విరమణ తర్వాత ఖాళీగా ఉంటే నిరుత్సాహం ఏర్పడుతుందని అలా కాకుండా సంతోషంగా కుటుంబంతో గడపాలని చెప్పారు.
ఏ రంగంలోనైనా కష్టపడి పని చేసినప్పుడే అందుకు తగిన గుర్తింపుతో పాటు ఉన్నత స్థానాలకు చేరుకోగలమన్నారు. పోలీస్ ఉద్యోగం ద్వారా ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం గర్వకారణమన్నారు. న్యాయం కోసం ఎదురు చూసే బాధితులకు అండగా నిలిచే అవకాశం పోలీస్ ఉద్యోగం ద్వారా లభిస్తుందని, పోలీస్ ఉద్యోగం ఎంతో ఉన్నతమైనదని చెప్పారు.
పదవీ విరమణ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, రాష్ట్ర నాయకులు సోమయ్య తదితరులున్నారు.