కరోనా నిబంధనలు పాటించకుండా కొందరు వ్యాపారులు రహస్యంగా వ్యాపారం చేస్తున్నారు. బయటి షట్టర్లు మూసి ఉంటున్నాయి కానీ లోపల వ్యాపారం జరుగుతూనే ఉన్న సంఘటనలు గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలంలో జరుగుతున్నాయి. దాంతో కరోనా వైరస్ మరింతగా పెరిగిపోతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మండలంలో 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మండలంలో ఉన్న అన్ని గ్రామంలో ప్రభుత్వం ప్రకటించిన సమయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే షాపులు తీసి ఉండాలి. అయితే షాపుల యజమానులు మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత షట్టర్లు వేసి లోపల వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీనివల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందవచ్చు అని పలు గ్రామాల్లో ప్రజలు అభిప్రాయం వ్యక్తం పరిచారు.
ముఖ్యంగా శ్రావణ మాసం రావడంతో బట్టల షాపులు షట్టర్లు వేసి లోపల వ్యాపారం కొనసాగిస్తున్నారు. వీటన్నిటిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి షాపుల యజమానులు ఇదే విధంగా కొనసాగిస్తే వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు కోరుతున్నారు.