ఆపదలో ఉన్న వారు ఫోన్ చేయండి అంటే ఆకతాయిలు ఫోన్ చేస్తున్నారు. ఇదే సమస్య. ఇలాంటి ఫేక్ కాల్స్ వల్లే నిజంగా పోలీసు సహాయం అందాల్సిన వారికి కూడా అందకుండా పోతున్నది. నిన్న అర్ధ రాత్రి సరిగ్గా ఆలాంటి సంఘటనే ఆరాంగఢ్ చౌరస్తాలో జరిగింది. బలవంతంగా ఓ మహిళను కారులో ఎక్కించుకొని వెళ్లినట్లు 100 నంబరుకు ఫోన్ వచ్చింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
అర్థరాత్రి విస్తృత తనిఖీలు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి పోలీసులు హుటాహుటిన తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి మైలార్దేవ్పల్లి పరిధిలోని ఉడంగడ్డ చౌరస్తాలో, శంషాబాద్ ఏరియాలోని గగన్పహడ్లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆర్జీఐఏ పోలీసులు రంగంలోకి దిగారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు మైలార్దేవ్పల్లిలో వ్యాన్ను పట్టుకున్నారు.
అయితే అందులో అమ్మాయిలు ఎవరూ లేరు. మహిళ లేకపోవడంతో వ్యాన్లో ఉన్న ముగ్గురు వ్యక్తులను విచారించారు. వారికి ఇలాంటి విషయం ఏం తెలీదని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో ఫేక్ కాల్ చేసినట్లు నిర్ధారించుకున్నారు. మహిళను వ్యాన్లో తీసుకెళ్లారంటూ డయల్ 100కు ఓ ఆటో డ్రైవర్ ఫిర్యాదు చేశాడని తేలింది.
దాంతో కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల్ని పెట్రోలు అయిపోతే పిలవడం, ఇలా ఫేక్ కాల్ చేయడం జరుగుతూ ఉంటే పోలీసులు కూడా నిజమైన కాల్స్ కు స్పందించకుండా పోయే ప్రమాదం ఉంటుంది. పౌరులు కూడా బాధ్యతతో వ్యవహారించాల్సి ఉంటుంది.