కరోనా మహమ్మారి భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆదివాసీలు ఇప్పుడు మావోలు, పోలీసుల వార్ లో ఏ క్షణాన ఏమి జరుగుతుందో అనే భయాందోళనకు గురవుతున్నారు. మావోల హిట్ లిస్టులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసిందిగా ఇప్పటికే పోలీసులు సూచించారు.
గత రెండు రోజులుగా పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు నిర్వహించి, బాంబ్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదే నేపద్యంలో ఎదురు కాల్పులు, మందుపాతర పేల్చిన ఘటనల్లో 60 మంది మావోల అగ్రనేతలు, సానుభూతిపరులపై పెదబయలు పోలీస్ స్టేషన్లో శుక్రవారం పోలీస్ కేసు నమోదు చేశారు.
ఈనెల 28 నుండి ఆగస్టు 3 వరకూ జరుగనున్న మావోయిస్టుల వారోత్సవాలు విజయవంతానికి మావోలు, మరోప్రక్క మావోల వారోత్సవాలు కట్టడికి పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆంద్రా ఒడిశా సరిహద్దుల్లో పెదబయలు మండలం లండులు అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు జరుగగా మావోయిస్టు అగ్రనేతలు గాయాలతో తప్పించుకున్నారని, 5 కిట్ బ్యాగులు, 303 వేపన్ స్వాధీనం చేసుకున్నామని పాడేరు డిఎస్పీ రాజ్ కమల్ ప్రకటించారు.
అదే విధంగా కూంబింగ్ పార్టీ పోలీసులు లక్ష్యంగా మావోలు అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చారు. మరుసటిరోజు ఇంజరి పంచాయతీ జముడుం అటవీ ప్రాంతంలో మరోసారి మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. వారోత్సవాలు విజయవంతం చేయాలని మావోయిస్ట్ విశాఖ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ శుక్రవారం లేక విడుదల చేసారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా అల్లూరి ఆదివాసీ సంఘం పేరిట శనివారం పోస్టర్లు వెలిశాయి.