క్యూ న్యూస్ పేరుతో సంచలనాత్మక విషయాలను వెలికి తెచ్చే సీహెచ్ నవీన్ కుమార్ ఎలియాస్ తీన్మార్ మల్లన్న చుట్టూ పోలీసులు ఉచ్చు బిగించారు. భూమి సమస్య పరిష్కరిస్తానని ఒక మహిళను ఆయన వేధించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత రెండు రోజులుగా కేసు పలు మలుపులు తిరుగుతున్నది.
తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానంగా తీన్మాన్ మల్లన్న మరి కొన్ని విషయాలను బయటపెట్టాడు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఫొటోలు బయట పెట్టారు. వాటిల్లో తన ఫొటో ఉందని, ఇది తన మర్యాదకు భంగకరమని ఆరోపిస్తూ ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్న ఫొటోలను బహిరంగంగా తన ఛానెల్ లో ప్రసారం చేసినందుకు తీన్మార్ మల్లన్న పై చర్య తీసుకోవాలని ఆమె కోరింది. ప్రియాంక అనే ఆ అమ్మాయి CCS లో ఫిర్యాదు చేయడంతో తీన్మార్ మల్లన్న కార్యాలయంలో పోలీసులు నేడు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
మల్లన్న కార్యాలయానికి భారీగా పోలీసులు తరలి వచ్చి సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకుని మల్లన్న మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలి వచ్చారు. పోలీసులు క్యూ న్యూస్ కంప్యూటర్లను తనిఖీ చేసి హార్డ్ డిస్క్ లను సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. తీన్మార్ మల్లన్నకు 41ఏ సీఆర్ పిసి ప్రకారం నోటీసులు జారీ చేశారు.