న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మహిళల కష్టాలను వెంటనే పరిష్కరించాలని ఏపి హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 2019 బ్యాచ్ ఎస్ ఐ ల పాసింగ్ అవుట్ పెరేడ్ లో ఆమె నేడు పాల్గొన్నారు. 1861 ఇండియన్ పోలీస్ యాక్ట్ ప్రకారం ప్రారంభమైన పోలీస్ శాఖ ప్రజా సేవలో ముందు వరుసలో ఉందని ఆమె ఈ సందర్భంగా అన్నారు.
పోలీస్ శాఖలోని అన్ని స్థాయిల్లో యువకులు ఎక్కువ శాతం ఉన్నారని హోం మంత్రి వెల్లడించారు. ఈ సంవత్సరం AP కి ఐదుగురు ఐపీఎస్ అధికారులతో పాటు, 25 మంది యువ డీఎస్పీ లు, 1591 మంది కానిస్టేబుల్స్ ను శిక్షణ పూర్తి చేసుకొని వచ్చారని ఆమె తెలిపారు.
దేశంలోనే తొలిసారి ఏపీ పోలీస్ సేవ యాప్ ను తీసుకువచ్చామని, దాదాపు 87 రకాల సేవలను ఈ యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని హోం మంత్రి తెలిపారు.
ఇప్పటికే దిశ మొబైల్ యాప్ ను దాదాపు 11 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని ఆమె వెల్లడించారు. అన్ని సందర్భాలలో ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా పేరుపొందిన పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.