ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో కొల్లాపూర్ మండలం సింగవట్నం గ్రామ శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది.
అదేవిధంగా ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎక్కువగా వస్తుంటారు.
కృష్ణా నది పడవ మార్గం ద్వారా అధికంగా వస్తుంటారు. ఇదివరకు గతంలో 2007లో లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు పుట్టి ప్రయాణం ద్వారా వస్తు 60మందికి పైగా కృష్ణానదిలో మునిగి గల్లంతయ్యారు.
ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. ఈనెల 17 నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా కృష్ణా నది తీర ప్రాంతాలైన మంచాలకట్ట,మల్లేశ్వరం, సోమశిల గ్రామాల పడవల యజమానులకు కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి హెచ్చరికలు జారీచేశారు.
సోమవారం సీఐ ఆదేశాలతో పెంట్లవెల్లి ఎస్ఐ శ్రీనివాస్ మంచాల కట్ట నదీదీరాన్ని పరిశీలించారు. పడవ యజమానులతో మాట్లాడారు.
అనుమతికి మించి పడవలో ఎక్కువ మందిని తరలించరాదని తెలిపారు. పోలీస్ నిబంధనలు పాటించక పోతే చర్యలు ఉంటాయన్నారు.
అదేవిధంగా పడవలో ఎక్కిన ప్రతి ఒక్కరు లైఫ్ జాకెట్లు ధరించేలా యజమానులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులను ఎలా ఎక్కించాలి,ఎలా తరలించాలనే అంశంపై ఎస్ఐ శ్రీనివాస్ అవగాహన కల్పించారు.