నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో మళ్లీ రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గానికి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు నేతలు కూడా బహిరంగ సవాళ్లు కూడా చేసుకున్నారు. ఎమ్మెల్యే బీరం కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో చేరగా, జూపల్లి కృష్ణారావు ఒరిజినల్ టీఆర్ఎస్ నాయకుడు. ఈ నేపథ్యంలో ఇక్కడ తరచూ రాజకీయ వివాదాలు చెలరేగుతుంటాయి.
గత కొద్ది రోజులుగా ఈ రాజకీయ వ్యవహారాలు చల్లారినట్లు కనిపించినా మళ్లీ తాజాగా హద్దులు దాటుతున్నాయి. రహదారుల మరమ్మతుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై ఇప్పుడు వివాదం చెలరేగుతున్నది. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలంలోని సాతపూర్ గ్రామం నుండి మారేడుమాన్ దిన్నే గ్రామ X రోడ్డు వరకు (6కి.మీ) బీటీ రోడ్డు మరమ్మత్తుకై నిధులు మంజూరయ్యాయి.
మొత్తం రూ.2కోట్ల 50 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధుల మంజూరును తామే చేయించామని ఎమ్మెల్యే బీరం వర్గీయులు చెప్పుకుంటుండగా ఈ వ్యవహారాన్ని జూపల్లి వర్గీయులు అపహాస్యం చేస్తున్నారు. ఈ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదనలు జూపల్లి కృష్ణారావు అధికారంలో ఉండగానే పంపించారని, అవే ఇప్పుడు కార్యరూపం దాల్చాయని జూపల్లి వర్గీయులు అంటున్నారు. తాజాగా వచ్చిన జీవోలను ఎమ్మెల్యే వర్గీయులు చేస్తుండగా జూపల్లి మంత్రిగా ఉన్న సమయంలో మంజూరు చేసినట్లు జీవో కాపీలను చూపిస్తున్నారు మాజీ మంత్రి అనుచరులు.