కేవలం 900 మంది సభ్యులు మాత్రమే ఉన్న ‘‘మా’’ ఎన్నికల కోసం ఇంత రాద్ధాంతం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నా జరిగేది మాత్రం ఆగడం లేదు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానళ్లు హోరా హోరీగా మాటల యుద్ధం చేసుకుంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
తాజాగా రాజకీయ పార్టీలు కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో తలదూరుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నా బావ అంటూ మంచు విష్ణు ముందుగా మా ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రస్తావన తీసుకువచ్చారు.
దానితో బాటు మంచు విష్ణు తన ప్యానెల్ లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు గిరిబాబు కుమారుడు రఘుబాబు లను పోటీకి దింపారు. దాంతో మంచు విష్ణు ‘‘మా ఎన్నికల్లో దయచేసి ఏ రాజకీయ పార్టీ జోక్యం చేసుకోవద్దు’’ అంటూ పైకి చెబుతున్నా లోలోన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలు పుష్కలంగా ఉంచుకున్నారు.
ప్రకాష్ రాజ్ ఓటమికి రంగంలో దిగిన బిజెపి
మంచు విష్ణు ప్రత్యర్థి అయిన ప్రకాష్ రాజ్ కర్నాటక ఎన్నికల సమయంలో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్ధిగా కూడా పోటీ చేశారు. ప్రధాని నరేంద్రమోడీపై పలు రకాల ఆరోపణలు కూడా చేశారు. దాంతో ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవరాదని బిజెపి పూర్తిగా మంచు విష్ణు కు సహకరిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.
అందుకు తగ్గట్టుగానే బిజెపి నాయకుడు బాబూ మోహన్ ను తన ప్యానెల్ కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి విష్ణు పోటీ పెట్టారు. ఇక ప్రకాష్ రాజ్ ను బీజేపీ వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి అని సీవీఎల్ నరసింహారావు అభివర్ణించారు. ఒక టీవీ చానల్ చర్చాకార్యక్రమంలో సీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ అంటే ఏ మాత్రం పడని ప్రకాష్ రాష్ కు సినిమా వాళ్లు ఎలా సపోర్ట్ చేస్తారన్నట్టుగా ఈయన ప్రశ్నించారు. ఇలా మా ఎన్నికల విషయంలోకి కూడా హిందుత్వ రాజకీయాన్ని ఆపాదిస్తున్నారు. ఇలా మంచు విష్ణు పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీల సహాయం తీసుకుంటున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో రంగంలో దిగినట్లు చెబుతున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ రాజకీయ ప్రస్తావన తీసుకురావడంతో తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహితుడని చెప్పారు. అంతే కాదు… తానంటే కేసీఆర్ కు ఇష్టమని కూడా ప్రకాష్ రాజ్ తెలిపారు.
ప్రకాష్ రాజ్ కు తెర వెనుక నుంచి చిరంజీవి, నాగార్జున లాంటి వారు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి, నాగార్జునలకు అత్యంత సన్నిహితుడైన సురేష్ కొండేటి ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్నారు. రాజకీయ పార్టీలు ఈ సారి పూర్తి స్థాయిలో మా ఎన్నికలలో తమ వంతు పాత్ర పోషిస్తున్నట్లు అందరూ నమ్ముతున్నారు.
బెదిరింపులు, ప్రలోభాలు షురూ….
రాజకీయ పార్టీలు రంగ ప్రవేశం చేయడంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి మందు పార్టీలు, ముడుపులు కూడా ఇస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు ముందుగా పూర్తి మద్దతు తెలిపిన వారిలో కీలకమైన వ్యక్తులను ఈ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా బెదిరిస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం వల్లే సీనియర్ నటులు, తెలుగు సినీపరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్న వారు మా ఎన్నికలలో ఎటూ మాట్లాడకుండా మౌనం పాటిస్తున్నారు.