ఖమ్మం నగరంలో లకారం ట్యాంక్ బండ్ పై సంక్రాంత్రి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్ బండ్ పై విద్యుత్ కాంతులు నడుమ ప్రారంభ వేడుకలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. లకారంపై వేసిన రంగు రంగుల రంగవల్లులను ఆసక్తిగా తిలకించారు.
డూ.. డూ..బస వన్నల విన్యాసం, కోళ్ల పందెంను తిలకించారు. చిన్నారుల నృత్యాలు అలరించాయి. బండ్ పై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఖమ్మం నగరంను అభివృద్ధి పథంలో ముందు నిలిపి, సుందరంగా చూడలన్నదే తన చిరకాల స్వప్నం అని ఆయన అన్నారు. అది ఇప్పుడు సాధ్యమైందని ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురైన ఖమ్మం నేడు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. త్రాగునీటి కష్టాలకు మిషన్ భగీరధ ద్వారా శాశ్వతంగా చెక్ పెట్టగలిగామని, గతంలో నగరంలో టాంకర్ లతో త్రాగునీరు వచ్చేవి.
కానీ నేడు ఆ పరిస్థితులు లేకుండా చేశాం. ఎమ్మెల్యేగా ఉన్న నాడే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులను చేసుకున్నాం. ఇప్పుడు మంత్రిగా మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం లభించిందని ఆయన అన్నారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ ఖమ్మంకే తలమానికంగా నిలిచింది.
ఇక్కడ మరిన్ని సౌకర్యాలు కలిపిస్తాం. చిన్న పిల్లలకు ఆటలు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను ప్రవేశపెట్టబోతున్నాం. వచ్చే సంక్రాంతికి మరో లకారంను అందిస్తాం అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి ఇతర కార్పొరేటర్లు ఉన్నారు.