ఖగోళంలో సుమారు 470 సంవత్సరాల అనంతరం సోమవారం అద్భుతమైన గ్రహాల మహా కలయిక చోటుచేసుకోనుంది. ధర్మ ప్రభువైన గురువు, కర్మ ప్రభువైన శని గ్రహాలు మకర రాశిలో కలిసే అరుదైన సంఘటన ఇది.
సోమవారం సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం పడమర దిక్కులో ఈ రెండు గ్రహాలు ఒకే నక్షత్రంలా ప్రకాశవంతంగా వీక్షకులకు కనువిందు చేయనున్నాయి.
ఈ అరుదైన గ్రహ కలయిక గురించి భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు పొన్నలూరి శ్రీనివాస గార్జియ విశ్లేషణాత్మకంగా వివరించారు.
శతాబ్దాల అనంతరం జరుగుతున్న అద్భుతం
సాధారణంగా ప్రతి 25 సంవత్సరాలకు గురు, శని గ్రహాలు రాశి చక్రంలో ఏదో ఒక రాశిలో కలవడం జరుగుతుంది.
అయితే గురువుకు నీచ క్షేత్రం, శనికి స్వక్షేత్రమయిన మకర రాశిలో మిత్రులైన వీరుభయులు కలవడం కొన్ని శతాబ్దాల అనంతరం చోటు చేసుంటుంది.
ఈ అరుదైన మహా కలయిక వలన ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉన్నట్లు గార్గేయ వెల్లడించారు. ఈ ప్రభావం 2021 జూలై10 వరకు ఉంటుందన్నారు.
పుష్య మాస ప్రారంభం 2021 జనవరి14 మకర సంక్రమణంతో మకర రాశిలో కాలసర్పయోగంతో పాటు పంచగ్రహ కూటమితో ప్రారంభమై పుష్య అమావాస్యనాటికి రెండో కాలసర్పయోగం తో షట్ గ్రహ కూటమి ఏర్పడనుందని గార్గేయ వెల్లడించారు.
పాలకుల కీర్తికి భంగం
మకర రాశిలో షట్ గ్రహాకూటమిలో బుద్దికారకుడైన బుధుడు, మనః కారకుడైన చంద్రుడు, ఆత్మకారకుడైన రవి, కళ్యాణ కారకుడు శుక్రుడు చంద్రుడి నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రంలో అరుదైన గ్రహ కూటమి కారణంగా ఫిబ్రవరి22 తరువాత కేంద్ర ప్రభుత్వ పాలకుల కీర్తికి భంగం వాటిల్లుతుందన్నారు.
రాజకీయ నాయకులు, ధనిక వర్గాలపై వ్యతిరేకత చూపనున్నట్లు చెప్పారు. దేశంలోని ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, హర్యానా, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొంత వ్యతిరేక ప్రభావం చూపనున్నట్లు గార్గేయ చెప్పారు.
ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఫట్
వీటిలో రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉండగా, మరో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారొచ్చని, ఇంకో రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గార్గేయ జోస్యం చెప్పారు.
రాజకీయంగా చక్రం తిప్పే నేతలు, అత్యంత ధనిక వర్గీయుల్లో ఉన్నత స్థాయిలోని వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతారన్నారు.
దేశ వ్యాప్తంగా ప్రజా ఆందోళనలు ఉధృతం అవుతాయని, వాటిని ప్రభుత్వాలు నిరోధించడానికి వీలులేనంతగా ఉంటాయన్నారు. కేంద్రం వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.
అలాగే ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందన్నారు. రోడ్డు, వాయు రవాణా నిలిచిపోయే అవకాశం ఉందన్నారు.
కరోనా ప్రభావం తగ్గించేందుకు చేసే టీకా ప్రయోగాలు సత్ఫలితాలు అంతగా ఉండక పోవచ్చన్నారు.
అరుదైన షట్గ్రహ కూటమి వలన కలిగే వ్యతిరేక ప్రభావాల నివారణకు ప్రజలు సంయమనం పాటించడంతో పాటు ఇష్ట దైవాన్ని ప్రార్ధించాలన్నారు.
ఇదిలాఉండగా జన్మతః జాతకచక్రంలో గురు, శని గ్రహాలు ఒకే రాశిలో ఉన్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు గార్గేయ వెల్లడించారు.