అన్నీ అనుకున్నట్లు జరిగితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా పొన్నం ప్రభాకర్ పోటీ చేస్తారు.
ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ తో టీఆర్ఎస్ నాయకులు రహస్య చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో తనకు భవిష్యత్తు లేదని భావిస్తున్న పొన్నం ప్రభాకర్ను తమ వైపునకు తిప్పుకోవడానికి టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.
ఇటీవల బిజెపిలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఎదుర్కొవాలంటే టీఆర్ఎస్ పార్టీకి ధీటైన అభ్యర్ధి దొరకడం లేదు. అందుకోసం పలువరు నేతలతో టీఆర్ఎస్ కీలక వ్యక్తులు టచ్ లోకి వెళ్లారు.
అందులో పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి చిక్కడంతో పొన్నం ప్రభాకర్ కు భవిష్యత్తుపై పెద్దగా ఆశలు కనిపించడం లేదు.
రేవంత్ రెడ్డితో అంతగా సఖ్యత లేని పొన్నం ప్రభాకర్ ఆయన పదవీ స్వీకార ఉత్సవానికి కూడా వెళ్లలేదు.
గత వారం పది రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో సీరియస్ గా పని చేస్తున్న పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అవుతున్నాడా అనే చర్చ జరిగింది కానీ రేవంత్ రెడ్డి అక్కడి స్థానిక నేత కౌషిక్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
దాంతో ఆ సీటుపై ఆశ పెట్టుకున్న పొన్నం ప్రభాకర్ కు నిరాశ ఎదురవుతున్నట్లు సూచన ప్రాయంగా తెలిసింది. ఇదే అదనుగా టీఆర్ఎస్ నేతలు కూడా మాటలు కలపడంతో పొన్నం అటుగా మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టగానే వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తి పార్టీ వీడితే అది కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బ అని, పొన్నంను చేర్చుకోవడం ద్వారా ఇలా రెండు లాభాలు దక్కుతాయని టీఆర్ఎస్ నేతలు మంత్రి కేటీఆర్ కు చెప్పినట్లు తెలిసింది.
రేవంత్ రెడ్డి రెస్పాన్స్ పై భవిష్యత్ నిర్ణయం తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ యోచిస్తున్నట్లు తెలిసింది.