కరోనా జనతా కర్ఫ్యూ సందర్భంగా నిరుపేదలెవరూ ఆకలితో అలమటించవద్దని తాను ఆదుకుంటానని నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు.
ఈరోజు నరసరావుపేట పట్టణ శివారు ప్రాంతమైన లలిత దేవి కాలనీలో పర్యటించిన ఆయన నిరుపేదలకు, యాచకులకు, అనాధలకు, ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు భోజనం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు ఉద్ధృతం అవుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదని అన్నారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ కార్యక్రమాన్ని అధికారులతో సహకరిస్తూ విజయవంతం చేయాలని ఆయన కోరారు.
మన ప్రాణాలను రక్షించడం కోసం అధికారులు అహర్నిశలు కష్టపడుతూ ఉంటే ప్రజలు నిమ్మకు నీరెత్తినట్లు రోడ్ల మీద తిరగటం వారి ఆరోగ్యాన్ని వారు నిర్లక్ష్యం చేయడమేనని డాక్టర్ చదలవాడ అన్నారు.
కరోనా వైరస్ సోకిన తర్వాత బాధపడే కంటే ముందస్తుగా ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించటం మంచిదని ఆయన తెలిపారు. నిరుపేదలు, బడుగు ,బలహీన వర్గాలు, నిత్యావసర సరుకులు కొనాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.
నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని ఇటువంటి క్రమంలో అధికారులు అధిక ధరలు విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ చదలవాడ డిమాండ్ చేశారు. నిరుపేదలు నిత్య అవసరాలు కొనలేక పస్తులతో కాలయాపన చేయాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటువంటి బాధాకరమైన ఘటనలను నివారించాలంటే అధిక ధరలకు విక్రయిస్తున్న షాపుల యాజమాన్యాలతో అధికారులు మాట్లాడి అధిక ధరలను నియంత్రించాలని ఆయన కోరారు. కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ, మల్లికార్జున రావు,నాగేశ్వరరావు, అమర్నాధ్, సుబ్బులు,చెన్నయ్య, బాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.