పాత్రికేయ కురువృద్ధుడు పొత్తూరి వెంకటేశ్వరరావు హైదరాబాదులో మృతిచెందారు. 1934 ఫిబ్రవరి 8న ఆయన గుంటూరు జిల్లా పుత్తూరులో జన్మించారు. 1957లో ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ వృత్తిలో ప్రవేశించిన ఆయన ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ లలో పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆయన పని చేశారు. 86 సంవత్సరాల వయసులో కూడా ఎంతో యాక్టీవగా ఉన్న ఆయన నేటి ఉదయం తుది శ్వాస విడిచారు.
సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వేంకటేశ్వర రావు మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషిని, అందించిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొత్తూరి వేంకటేశ్వర రావు అందించిన నైతిక మద్దతును కెసిఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వేంకటేశ్వర రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.