మూడు కరంటు కోతలు ఆరు ఉక్కపోతలతో 26 జిల్లాల జగన్ పాలన ప్రారంభం అయిందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.
ఏపీ లో కరంటు కోతలు, ఉక్కపోతలు, కరెంటు బిల్లుల మోతలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. చిలకలూరిపేట నవతరంపార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బొగ్గు నిల్వలు విషయం లో ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు విద్యుత్ సరఫరా చేయలేక అధికారులు చేతులెత్తేసారని విమర్శించారు.
ప్రజల్ని ఏసీలు,కూలర్లు వాడొద్దని, స్వయంగా కరెంటు కోతలు విధించుకోవాలని పనికిరాని సలహాలు ఇస్తున్నారని అన్నారు. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉక్కపోతలతో చుక్కలు చూపించిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జనాలు చెమటలు పట్టించి ఇంటికి పంపిస్తారు అని తెలిపారు.
నెలకు 300 యూనిట్ల కరెంట్ వాడుకున్న పేదలకు బియ్యం కార్డులను తీసివేయడం తప్ప జగన్ సర్కార్ పేదోళ్లకు చేసిందేమి లేదన్నారు.నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, కరంటు బిల్లులు తగ్గించాలని నవతరంపార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు.