తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. రేపటి నుండి నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని బైంసా నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగే పాదయాత్ర కరీంనగర్ లో ముగియనుంది. వచ్చే నెల 17 వరకు పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది.
ముగింపు రోజున జరిగే బహిరంగ సభకు జాతీయ స్థాయి అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. తొలిరోజు నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి ఆలయాన్ని బండి సంజయ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈరోజు రాత్రి బండిగ సంజయ్ నేరుగా కరీంనగర్ నుండి బయలు దేరి నిర్మల్ చేరుకుంటారు. మరుసటి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం నేరుగా బైంసా గెస్ట్ హౌజ్ కు వెళతారు. కొద్దిసేపు స్థానిక నేతలతో సమావేశమవుతారు.
ఆ తరువాత బైంసా సభకు హాజరవుతున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు స్వాగతం పలుకుతారు. అక్కడి నుండి ఇద్దరూ కలిసి బైంసా పట్టణంలోని వై జంక్షన్ పర్ది బైపాస్ రోడ్ వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుండి పాదయాత్ర ప్రారంభిస్తారు. తొలిరోజు 6.3 కి.మీలు నడిచి ముథోల్ నియోజకవర్గంలోని గుండగామ్ సమీపంలో రాత్రి బస చేస్తారు.
ఈనెల 29న రెండోరోజు పాదయాత్ర గుండగామ్ నుండి మహాగాన్, చటా మీదుగా లింబాకు చేరుకుంటారు. రెండోరోజు మొత్తం 13 కి.మీలు నడుస్తారు. 3వ రోజు లింబా నుండి ప్రారంభమై కుంటాల, అంబకంటి మీదుగా మొత్తం 13.7 కి.మీలు పాదయాత్ర చేసి బామిని బూజుర్గ్ సమీపంలో రాత్రి బస చేస్తారు. పాదయాత్ర మొదటి మూడు రోజులు ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే కొనసాగనుంది.నాలుగో రోజైన డిసెంబర్ 1 నుండి 6వరకు నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది.
1న బామిని బూజుర్గ్ నుండి నందన్, నశీరాబాద్ మీదుగా 10.4 కి.మీలు పాదయాత్ర చేసి రాంపూర్ చేరుకుని రాత్రి బస చేస్తారు. 2న రాంపూర్ నుండి లోలమ్ మీదుగా చిట్యాల దాకా మొత్తం 11.1 కి.మీలు నడుస్తారు. డిసెంబర్ 3న చిట్యాల నుండి మంజులాపూర్, నిర్మల్ రోడ్, ఎడిగాం, ఎల్లపల్లి, కొండాపూర్ మీదుగా ముక్తాపూర్ వరకు మొత్తం 12.3 కి.మీలు పాదయాత్ర చేస్తారు. డిసెంబర్ 4న లక్మణ్ చందా మండలంలోని వెల్మల, రాచాపూర్, లక్మణ్ చందా, పోటపల్లి వరకు మొత్తం 12.7 కి.మీలు పాదయాత్ర కొనసాగిస్తారు. డిసెంబర్ 5న మమ్డా మండలంలోని కొరైకల్ మమ్డా, దిమ్మతుర్తి వరకు 11.5 కి.మీలు నడుస్తారు.
డిసెంబర్ 6, 7 తేదీల్లో ఖానాపూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. 6న దొమ్మతుర్తి, ఇక్బాల్ పూర్, తిమ్మాపూర్, ఖానాపూర్ మీదుగా 12.8 కి.మీలు నడిచి మస్కాపూర్ దాకా నడుస్తారు. 7న మస్కాపూర్ లోని సూరజ్ పూర్, బడాన్ ఖర్తి, ఓబులాపూర్, మొగల్ పేట మీదుగా 12.8 కి.మీలు నడిచి కోరుట్ల నియోజకవర్గంలోని కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో బస చేస్తారు.
డిసెంబర్ 8,9 తేదీల్లో కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్, కోరుట్ల మండలాల్లో మొత్తం 21.7 కి.మీలు పాదయాత్ర చేయనున్నారు. డిసెంబర్ 10న కోరుట్ల పట్టణం నిం వెంకటాపురం, మోహన్ రావు పేట మీదుగా 12.3 కి.మీలు నడిచి వేములువాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండల కేంద్రంలో రాత్రి బస చేస్తారు.డిసెంబర్ 11న మేడిపల్లి నుండి తాటిపల్లి మీదుగా 10.1 కి.మీలు నడిచి జగిత్యాల రూరల్ మండల కేంద్రంలో రాత్రి బస చేస్తారు.
12న జగిత్యాల పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 10.4 కి.మీలు సాగే ఈ పాదయాత్రలో రాత్రి తారకరామనగర్ లో బస చేస్తారు.డిసెంబర్ 13న తారకరామనగర్ నుండి చొప్పదండి నియోజకవర్గంలోని చిచ్చాయ్, మల్యాల చౌరస్తా, మల్యాల మీదుగా 13.3 కి.మీలు నడిచి కొండగట్టు సమీపంలో రాత్రి బస చేస్తారు. డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో చొప్పందండి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుది.
డిసెంబర్ 16 నుండి 17 వరకు కరీంనగర్ నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగిస్తారు. చివరి రోజు కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల వద్ద పాదయాత్రను ముగిస్తారు. ఆరోజు సాయంత్రం ఎస్సారార్ కాలేజీలో జరిగే పాదయాత్ర-5 ముగింపు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.