కోర్టు ధిక్కార నేరంపై క్షమాపణలు చెప్పేందుకు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ నిరాకరించారు. న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపడం ద్వారా అత్యున్నత న్యాయ స్థానం వాటిని సవరించుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే తాను ఆ విధమైన ట్విట్లు పెట్టాను తప్ప సుప్రీంకోర్టును కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని ఆయన అన్నారు.
అందువల్ల తాను క్షమాపణ చెప్పే అవసరమేలేదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషన్ పై కోర్టు ధిక్కార నేరం ఖరారు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ధిక్కార నేరానికి శిక్షను మంగళవారంనాడు ఖరారు చేయాల్సి ఉంది. ఈ లోపు ఆయన క్షమాపణ చెప్పాలనే ప్రతిపాదన రాగా అందుకు ఆయన నిరాకరించారు.
తాను అప్పటి న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్ తదితరులు మీడియా సమావేశంలో చెప్పిన విషయాలనే ఉటంకించానని, తాను చెప్పిన విషయాలను కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ కూడా చెప్పారని ప్రశాంత్ భూషణ్ అన్నారు.
ప్రశాంత్ భూషన్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినట్లు ధృవీకరిస్తే వీరంతా కూడా కోర్టు ధిక్కార నేరం చేసినట్లుగా నే భావించాల్సి వస్తుందని ప్రశాంత్ భూషన్ తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ పేర్కొన్నారు.