30.7 C
Hyderabad
April 19, 2024 10: 51 AM
తెలంగాణ

‘ప్రీమెచ్యూర్’ వైద్యంతో చిన్నారి మృతి

kollapur

కాన్పు చేసేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. నొప్పులు వస్తే అవి అసలైన నొప్పులా, ఫాల్స్ నొప్పులా అనేది ముందుగా డాక్టర్లు చూసుకుంటారు. నిజమైన నొప్పులే అయితే, మరిన్ని సమస్యలు తలెత్తకుండా సిజేరియన్ చేయడమో లేక వేచి చూసి నార్మల్ డెలివరీ చేయడమో జరుగుతుంది. ఈ నెల 20 వరకూ డెలివరీ కావచ్చు అని వైద్యులు చెప్పిన కేసులో ఒక డాక్టర్ తొందరపడి డెలివరీ చేసేసి పసిగుడ్డు మరణానికి కారణం అయ్యాడు. వైద్య సమాచారం పూర్తిగా తెలియని అమాయకులు తమ పిల్లను పోగొట్టుకుని భోరున విలపిస్తున్నారు. కొల్లాపూర్ లోని సాయి కృప ఆసుపత్రిలో ఈ దుర్ఘటన జరిగింది. పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబోగుడ గ్రామానికి చెందిన పుట్టపాగ సరిత (భర్త పుట్టపాగ రవీందర్) ఆగస్టు5 వ తేదీన నొప్పులతో కొల్లాపూర్ లోని సాయి కృప ఆసుపత్రిలో చేరింది. 6వ తేదీనే అక్కడి డాక్టర్లు ఆమెకు డెలివరీ చేయటానికి సిద్ధం అయ్యారు. అయితే తమకు ఎందుకో అనుమానంగా ఉందని ముందుగా స్కానింగ్ చేసి ఆ తర్వాత డెలివరీ చేయాలని భర్త కోరాడు. ఎందుకంటే గతంలో చూపించిన ఆసుపత్రిలో డెలివరీ డేట్ 20 తేదీ ఇచ్చారని కూడా చెప్పాడు. అయితే డాక్టర్లం మేమా మీరా అంటూ ప్రశ్నించిన డాక్టర్ సరితకు డెలివరీ చేసేశాడు. పుట్టిన తర్వాత పాప బరువు కిలోన్నర ఉంది. ఆస్పత్రిలో చిన్నపిల్లల డాక్టర్ లేకపోతే కొల్లాపూర్ పట్టణంలోని చిన్నపిల్లల ఆసుపత్రికి రెఫర్ చేశారు. అయితే డాక్టర్ పాపను చూసి అన్ని విధాలుగా పాప ఆరోగ్యంగానే   ఉందని చెప్పారు. అక్కడి నుంచి పాపను తల్లి చెంతకు తీసుకెళ్లారు. అయితే ప్రీమెచ్యూర్ బేబీ కావడంతో ఇంక్యుబేటర్ లో ఉంచాల్సి వస్తుంది. ఈ విషయం తల్లిదండ్రులకు ఎవరూ చెప్పలేదు. పైగా మూడు రోజులు పాపను ఆసుపత్రిలో  ఎలా ఉంచుకున్నారో తెలియదు. తరువాత పాప అస్వస్థతకు గురైంది. దీంతో ఆసుపత్రి యజమాన్యం  మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ పాపను తీసుకెళ్లేలోపే  పరిస్థితి విషమించింది. దీంతో అక్కడినుండి  హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పాపకు పరిస్థితి పూర్తిగా విషమించడంతో మృతి చెందింది. పాప పరిస్థితి విషమంగా ఉంటే  మూడు రోజులు సౌకర్యాలు లేని చోట  ఎలా ఉంచుకున్నారని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. పాప మృతదేహాన్ని సమాధి చేసి అనంతరం బాధిత కుటుంబ సభ్యులు కొల్లాపూర్ సాయి కృప ఆసుపత్రి డాక్టర్ కొండ శ్రీనుతో మాట్లాడేందుకు వెళ్లగా ఆయన సరిగా సమాధానం చెప్పలేదు. గ్రామ సర్పంచ్ రవి నాయక్ ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితి వివరించినా లాభం లేకపోవడంతో ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డాక్టర్ కొండ శ్రీను స్థానిక సీఐ  కి   ఫోన్ చేసి  చెప్పారు. వెంటనే  ఎస్సై వెంకట సత్యనారాయణ, కే. మురళి గౌడ్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కొల్లాపూర్ అమ్మ ఆసుపత్రి చిన్న పిల్లల  వైద్యుడు యాదగిరిని పిలిపించి  జరిగిన విషయాలు తెలుసుకున్నారు. ఇందులో వైద్యుల  పొరపాట్లు ఉన్నాయని ఆయన చెప్పినట్లు తెలిసింది. దాంతో పెద్దల సమక్షంలో డాక్టర్ ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాడు. అయితే ఎవరికి అర్ధం కాని విషయం ఏమిటంటే క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన పాప తిరిగి వస్తుందా???

Related posts

అప్పుడు బాగా ఖర్చు చేశా ఇప్పుడు ఆదా చేయాలి

Satyam NEWS

ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం నేరుగా చర్చలు జరపాలి

Satyam NEWS

బిజెపి గూటికి మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ?

Satyam NEWS

Leave a Comment