దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకంపై సంతకం చేశారు. గత వారమే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ తన వారసుడిగా యూయూ లలిత్ను ఎంపిక చేశారు.
జస్టిస్ లలిత్ను నియమించాలని ఆయన ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రధాన న్యాయమూర్తి రమణ 24 ఏప్రిల్ 2021న దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన కన్నా ముందు జస్టిస్ ఎస్. a. బాబ్డే దేశ ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.
చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నందున తదుపరి సీజేఐగా జస్టిస్ లలిత్ పదవీకాలం మూడు నెలల లోపే ఉంటుంది. జస్టిస్ యుయు లలిత్ సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక మైలురాయి తీర్పులలో భాగమయ్యారు.
ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ లలిత్ సభ్యుడు. అదే విధంగా ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కేరళలోని చారిత్రక శ్రీ పద్మనాభస్వామి ఆలయ నిర్వహణకు అప్పటి ట్రావెన్కోర్ రాజకుటుంబానికి అధికారం ఇచ్చింది.
ఇది అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. జస్టిస్ లలిత్ ధర్మాసనం ‘స్కిన్ టు స్కిన్ టచ్’పై తీర్పునిచ్చింది. పిల్లల శరీరంలోని లైంగిక భాగాలను తాకడం లేదా ‘లైంగిక ఉద్దేశ్యం’తో శారీరక సంబంధం కలిగి ఉన్న చర్య పోక్సో చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ‘లైంగిక దాడి’గా పరిగణించబడుతుందని తీర్పు పేర్కొంది.
పోక్సో చట్టం కింద రెండు కేసుల్లో బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును తోసిపుచ్చింది జస్టిస్ లలిత్ ధర్మాసనం. నేరుగా ‘చర్మంతో చర్మం’ కాంటాక్ట్ లేనందున, లైంగిక నేరం జరగలేదని చెప్పిన హైకోర్టు తీర్పును తప్పుపట్టిందని పేర్కొంది.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బి(2) ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం నిర్దేశించిన ఆరు నెలల వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరి కాదని చెప్పిన ధర్మాసనంలో జస్టిస్ లలిత్ కూడా ఉన్నారు. ఇటీవల జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ నాలుగు నెలల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించింది.