ఈ నెల 24వ తేది మంగళవారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుపతి, తిరుమల పర్యటనకు వస్తున్నందున ముందస్తు ఏర్పాట్లను అధికారులు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ నెల 24 వ తేది రాష్ట్రపతి తిరుపతి, తిరుమల పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారని తెలిపారు. రాష్ట్రపతి తిరుచానూరు లోని పద్మావతి ఆలయానికి వెళ్ళే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతంలో ఆలయం వద్ద ఏర్పాట్లను పకడ్బంధీగా చేపట్టాలన్నారు. రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ విషయంలో ఎక్కడా రాజీపడకూడదన్నారు.
రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) రాజశేఖర్ పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని, విఐపి ల వసతి, భోజన ఏర్పాట్లు, విద్యుత్ కు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని, మెడికల్ టీమ్ ల ఏర్పాటు, ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లు, శానిటేషన్ ఏర్పాట్లు, ఫైర్ ఇంజన్ల ఏర్పాటు, బొకేల ఏర్పాట్లు, వాహనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పూర్తి స్థాయిలో కవరేజ్ కల్పించేందుకు సమాచార శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అధికారులకు ఏదైతే విధులు కేటాయించామో ఆ విధులను అధికారులు తూచా తప్పకుండా నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) రాజశేఖర్, డిఆర్ఓ మురళి, ఆర్డిఓ డా. సి. రేణుక, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, డిటిసి బసిరెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.