నూతనంగా వస్తున్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జడ్పీహాల్ నందు శనివారం పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్యోజనపై నిర్వహించిన సెమినార్ లో మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రోడ్ల విస్తరణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నదని వెల్లడించారు.
రోడ్లు బాగుంటేనే రవాణా సౌకర్యం మెరుగై గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. రోడ్లు, భవనాల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే ఫలితం దక్కదని వివరించారు. ఇంజనీర్లు నాణ్యతా ప్రమాణాలకే ప్రాధాన్యతనివ్వాలని ఈ సందర్భంగా కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీని ఇంజనీర్లు అందిపుచ్చుకోవాలన్నారు.
కొత్త టెక్నాలజీ ద్వారా రోడ్లు వేయడం వల్ల 15 నుంచి 20 శాతం వరకు అన్ని రకాలుగా ఆదా అవుతుందని తెలిపారు. చాలిచాలని నిధులతో గతంలో ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలంలో Granular Sub Base(GSB) టెక్నాలజీని తో 426 రోడ్లు కేవలం 2 కోట్ల రూపాయలతో చేశామని అలాంటి పద్ధతులను అవలంబిస్తూ రోడ్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
మోడీ ప్రధాని అయ్యాక PMGSY ని తీవ్ర నిర్లక్ష్యంకు గురి చేశారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 25km కూడా సరిగా ఇవ్వలేకపోయిందన్నారు. జిల్లాలో వేయాల్సిన గ్రామీణ రోడ్లు వేల కిలోమీటర్ల ఉన్నాయని, వాటిపై కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిచేస్తుందన్నారు. ఖమ్మంకు పూర్తిగా అన్యాయం జరిగిందని గుర్తి చేశారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకుని కేంద్ర మంత్రులు పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. గడచిన 7ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం సహకారంతో వేల కిలోమీటర్ల రోడ్లు వేసుకున్నాం. ఏ రంగంలో తీసుకున్న తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు.
కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , పంచాయతీరాజ్ ఎస్ ఈ సీతారాం , ఈ ఈ చంద్రమౌళి , డిఈలు, ఏఈ లు తదితర సిబ్బంది ఉన్నారు.