అరవై సంవత్సరాల అనంతరం ఖగోళంలో అద్భుతమైన గ్రహాల మహా కలయిక చోటుచేసుకోనుంది. ప్రజలంతా ఘనంగా జరుపుకునే మకర సంక్రాంతి కాలసర్ప యోగంలోనే రావడంతో పాటు అదే రోజు మకర రాశిలో పంచగ్రహ కూటమి జరగడం మరో అరుదైన విశేషం.
వరుస గ్రహాకూటమిలతో పాటు కాలసర్ప యోగాలకు సంబంధించి ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు పొన్నలూరి శ్రీనివాస గార్గేయ విశ్లేషణాత్మకంగా వివరించారు. ఇప్పటికే మకర రాశిలో ధర్మ ప్రభువైన గురువు, కర్మ ప్రభువైన శని గ్రహాల అరుదైన కలయికతో పాటు బుద్ది కారకుడైన బుధుడు కూడా కలిసి వున్నారు.
రెండు సార్లు కాలసర్ప యోగం
వీరికి తోడు మనః కారకుడైన చంద్రుడు, ఆత్మ కారకుడైన రవి వీరితో కలవనున్నారు. పుష్య మాస ప్రారంభం జనవరి14 మకర సంక్రమణంతో మకర రాశిలో కాలసర్పయోగంతో పాటు పంచగ్రహ కూటమితో ప్రారంభమై ఫిబ్రవరి11 పుష్య అమావాస్యనాటికి రెండో కాలసర్పయోగంతో షట్ గ్రహ కూటమి ఏర్పడనుందని గార్గేయ వెల్లడించారు.
మకర రాశిలో షట్ గ్రహాకూటమిలో బుద్దికారకుడైన బుధుడు, మనః కారకుడైన చంద్రుడు, ఆత్మకారకుడైన రవి, కళ్యాణ కారకుడు శుక్రుడు అరుదైన గ్రహ కూటమి గా ఏర్పడనుందన్నారు. ఇదిలావుండగా మొదటి కాలసర్ప యోగం ఈ ఏడాది జనవరి10న ప్రారంభమై 24న ముగుస్తుందని గార్గేయ చెప్పారు.
విశ్వవ్యాప్తంగా వ్యతిరేక ప్రభావం
అలాగే రెండవ కాలసర్ప యోగం ఫిబ్రవరి6న పారరంభమై 21న ముగియనుండగా, మూడోది మార్చి6న ప్రారంభమై 20న ముగుస్తుందన్నారు. వీటితో పాటు ఫిబ్రవరి22న వృషభ రాశిలో కుజ-రాహువులు ఏప్రిల్13 వరకు ఉంటారన్నారు. పంచ, షట్ గ్రహ కూటములు, కాలసర్ప యోగాలతో పాటు కుజరాహువుల సంఘర్షణ, జేష్ఠ నక్షత్రంలో కేతువు ఉండడం కారణంగా విశ్వవ్యాప్తంగా వ్యతిరేక ప్రభావం ఉంటుందని గార్గేయ వెల్లడించారు.
అంతరిక్షంలో ఈ అరుదైన గ్రహ కూటముల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉన్నట్లు గార్గేయ పేర్కొన్నారు. ఈ ప్రభావం 2021 జూలై10 వరకు ఉంటుందన్నారు. రాజకీయ నాయకులు, ధనిక వర్గాలపై వ్యతిరేకత చూపనున్నట్లు చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, ఆర్ధిక సంక్షోభం
శత్రు దేశాలతో యుద్ధ భయాలు, మత విద్వేషాలు, ఆకస్మిక సునామీలు, విమాన రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. విషవాయువులు, వింత వ్యాధులతో జన నష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా ఫిబ్రవరి22న వృషభ రాశిలో కుజ-రాహువుల సంఘర్షణ ఏప్రిల్13 వరకు ఉండడంతో ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, ఆర్ధిక సంక్షోభం ఉంటుందన్నారు.
స్టాక్ మార్కెట్ పట్ల మదుపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు కొంత వ్యతిరేక ప్రభావం చూపనున్నట్లు గార్గేయ చెప్పారు. రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉండగా, మరో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారొచ్చని, ఇంకో రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గార్గేయ జోస్యం చెప్పారు.
ప్రధాని మోడీకి సమస్యలు
రాజకీయంగా చక్రం తిప్పే నేతలు, అత్యంత ధనిక వర్గీయుల్లో ఉన్నత స్థాయిలోని వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతారన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజా ఆందోళనలు ఉధృతం అవుతాయని, వాటిని ప్రభుత్వాలు నిరోధించడానికి వీలులేనంతగా ఉంటాయన్నారు. ప్రధాని మోడీకి సమస్యలు చుట్టుముడతాయన్నారు.
మొదటి కాలసర్ప యోగం ప్రారంభం కాగానే సాగు చట్టాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కేంద్రానికి షాక్ తగలడం ఇందుకు నిదర్శనం అన్నారు. వీటివల్ల ఎదురయ్యే సమస్యలు ఎదుర్కొవడాని ప్రజలు భావోద్వేగాలు విడనాడి దైవ ప్రార్థనతో సంయమనం పాటించాలని గార్గేయ సూచించారు.