ముఖ్యమంత్రి వాగ్దానం, ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపట్టే పనుల ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఆదివారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ప్రత్యేక అభివృద్ధి నిధులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం వాగ్దానం, ప్రత్యేక అభివృద్ధి నిధుల క్రింద జిల్లాకు ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. అట్టి నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సమర్పించి మంజూరులు పొందాలన్నారు. మధిర మునిసిపాలిటీ కి రూ. 30 కోట్లు, మేజర్ గ్రామ పంచాయితీలు కల్లూరు, తల్లాడ, పెద్దతండా, ఏదులాపురం, నేలకొండపల్లి లకు రూ. 10 కోట్ల చొప్పున విడుదలైన నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రజలకు ఉపయుక్తంగా వుండే పనులు చేపట్టాలన్నారు. సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన తెలిపారు. ఇట్టి పనులతో ఆయా ప్రాంతాల్లో స్పష్టమైన మార్పు కనపడాలన్నారు. ఓపెన్ జిమ్ తదితర అన్ని సౌకర్యాలతో పార్కుల అభివృద్ధి, ఏబిసి కేంద్రాల ఏర్పాటు, స్వీపింగ్ యంత్రాలు సమకూర్చుకోవడం చేయాలన్నారు. స్థానిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జెడ్పి సిఇఓ వివి. అప్పారావు, సిపిఓ శ్రీనివాస్, పీఆర్ ఇఇ లు చంద్రమౌళి, కెవికె. శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, ఎంపీడీఓ లు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
previous post