ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? కచ్చితంగా అది కూడా చేలోకే వెళుతుంది. పెద్దలు పై స్థాయిలో ఇసుక దందా చేస్తుంటే కిందిస్థాయిలో కూడా ఇసుక దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం నడిపెల్లి గ్రామంలోని ఇసుక ర్యాంప్ నుంచి తోడే ఇసుకకు లోకల్ లీడర్ కు కప్పం కట్టాల్సి వస్తున్నది. జగనన్న ఇళ్ల కాలనీలకు ఉచితంగా ఇసుక ఇవ్వాల్సి ఉండగా అలాంటి ట్రాక్టర్ల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. జగనన్న ఇళ్ల కాలనీకి ఇసుక పంపుతున్నామని చెబుతూ అక్రమంగా బ్లాక్ మార్కెట్ లో ఇసుకను యధేచ్ఛగా అమ్ముకుంటున్నారు.
డిపెల్లి సర్పంచ్ కి సంబంధించిన ఒక వ్యక్తిని పెట్టి ఇసుక ట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. పై ఫోటోలో ఉన్న వ్యక్తి ట్రాక్టర్ ఓనర్ దగ్గర ట్రాక్టర్ డ్రైవర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరన్నా, మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే మీ దిక్కున కాడ చెప్పుకోమని బెదిరిస్తున్నాడు. జగనన్న కాలనీకి నడిపెల్లి ఇసుక ర్యాంపు నుండి ఉచిత ఇసుక తరలింపు జరుగుతుండగా ఇలా ప్రయివేటు వ్యక్తులకు డబ్బులు కట్టాల్సి రావడంపై నిరసన వ్యక్తం అవుతున్నది. దీనిపై అధికారులు స్పందించి దీనిని ఆపవలసిందిగా గ్రామస్తులు జగనన్న కాలనీకి ఇసుక తరలించుకునే వాళ్ళు కోరుతున్నారు. నడిపెల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ విషయంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరుతెస్తున్న వీరిని అధికారులు అడ్డుకోవాలని కోరుతున్నారు.