ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జీవో నెం.46 ను ఉల్లంఘిస్తూ విద్యార్ధుల తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం మోపుతున్నారని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు చందన, మణికంఠ లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉప్పల్ మండలంలో అన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్ధుల తల్లిదండ్రులపై ట్యూషన్ ఫీజుతో పాటు వివిధ రకాల ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తూ వసూలు చేస్తున్నారన్నారు.
జీవో నెం.46 ను ఉల్లంఘిస్తుంటే ప్రభుత్వ అధికారులు తమకేమి పట్టనట్లు చోద్యం చూస్తున్నారని వారు విమర్శించారు. లాక్డౌన్ సమయంలో ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులను ఆదుకోక పోగా అలాగే ప్రతి విద్యార్ధితో ఫీజులు వసూలు చేసినప్పటికి ఉపాధ్యాయులకు సగం జీతం మాత్రమే ఇస్తున్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలున్నాయన్నారు. ఇకనైనా మారకపోతే బలమైన ఉద్యమాన్ని నిర్మించి పోరాటాలు నిర్వహించాల్సి ఉంటుందని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు.