కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో గత 5 నెలలుగా ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల సంఘ( టి పి టి ఎఫ్ ) తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది.
హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కార్పోరేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న శివాని (36) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతికి సంతాప సూచకంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘం TPTF నల్లని బ్యాడ్జిలతో నివాళులర్పించారు.
కొద్దిసేపు మౌనం పాటించిన అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ మాట్లాడుతూ ప్రైవేటు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు ప్రతి నెల రూ 10,000 చొప్పున ఆర్థిక భృతి కల్పించి ఉపాధ్యాయుల ఆత్మహత్యలను ఆపాలని, ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే వరకు ఈ చర్యలు చేపట్టాలని కోరారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఇలాంటి సంఘటనలకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు ఉపాధ్యాయులు నలబోలు భూపాల్ రెడ్డి, పింగళి నర్సి రెడ్డి, మన్నెం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.