లోక్ సభలో కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోసిన ప్రధాని నరేంద్రమోడీకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఘాటు సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన వలసదారులకు కాంగ్రెస్ ఉచిత రైలు టిక్కెట్లు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు.
కరోనా మొదటి వేవ్ కాలంలో మహారాష్ట్ర నుంచి వలస కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఉచితంగా రైలు టిక్కెట్లు కొనిపెట్టడం వల్లే పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కోవిడ్ -19 వ్యాపించిందని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీ నేడు పనాజీలో మీడియాతో మాట్లాడుతూ కాలినడకన తిరిగి సొంత గ్రామాలకు వెళ్లే వారికి ఎవరూ సహాయం చేయకూడదని ప్రధాని మోడీ కోరుకున్నారా? అని ఆమె ప్రశ్నించారు.
మోడీ జీ ఏమి కోరుకున్నారు? ఆయను ఏమి కావాలి? కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అచేతనంగా మిగిలిపోయిన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి వలస కార్మికులకు చేతనైన సాయం చేసిందని ప్రియాంక అన్నారు. పేదలు కాలినడకన తమ ఇళ్లకు తిరిగి వస్తున్నప్పుడు ప్రధాని నిస్సహాయంగా మిగిలిపోయారని, అందరూ అలానే ఉండిపోవాలని ఆయన కోరుకున్నారని ప్రియాంక అన్నారు. కోవిడ్ సమయంలో ప్రధాని మోడీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించారని ఆమె వ్యాఖ్యానించారు.