రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, తనకు రక్షణ లేదని గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్లు చెబుతున్న లేఖపై తక్షణమే విచారణ జరిపించాలని వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి డీజీపీకి లేఖ రాశారు.
ఈ లేఖ ఎవరు రాశారు? ఎవరు రాయించారు అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. తనకు ఉన్న సమాచారం మేరకు ఆ లేఖ లోని రమేష్ కుమార్ సంతకం ఫోర్జరీ చేసిందని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, డాక్యుమెంట్లు అని నమ్ముతున్నానని ఆయన అన్నారు.
రాష్ట్ర ఎన్నికల మాజీ కమీషనర్ ఎన్.రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్భంగా చేసిన సంతకానికి, ఈ లేఖలో ఉన్న సంతకానికి మధ్య తేడా ఉందని ఆయన తెలిపారు. ఈ ఫోర్జరీ సంతకం చేసిన లెటర్ టిడిపి ఆఫీసులోనే తయారైందని తనకు సమాచారం ఉందని ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తున్నారని ఆయన తెలిపారు.
టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, వర్ల రామయ్య, టీడీ జనార్ధన్ ఈ లేఖను సృష్టించారని విజయ సాయి రెడ్డి ఆరోపించారు. ఈ తతంగమంతా గత ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్కు తెలిసే జరిగిందని, ఈ ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాలని ఆయన కోరారు. ఈ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలి. వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించాలి అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.