గుంటూరు జిల్లా మంగళగిరి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం గత ఆరు నెలలుగా ఇన్చార్జ్ పాలనలో కొనసాగుతోంది. ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం వచ్చే రిజిష్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ను నియమించక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక రిజిష్ట్రేషన్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో జనం విసుగెత్తిపోతున్నారు. ఆరు నెలలుగా ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ నియమించడంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. మంగళగిరి శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.
తుళ్లూరు,తాడేపల్లి మండలాలు మంగళగిరి సబ్ రిజిస్టార్ కార్యాలయ పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా భూములకు సంబంధించి రిజిష్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. లాక్ డౌన్ కు ముందు సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో రోజుకు కనీసం షుమారు వందకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగేవి.
ప్రస్తుతం రోజుకు 10-15 రిజిస్ట్రేషన్ లు మాత్రమే జరుగుతోన్నాయి. గతంలో మంగళగిరి సబ్ రిజిష్ట్రార్గా పనిచేసిన రాధాకృష్ణ మూర్తి ఆరు నెలల క్రితం గుంటూరు డీఐజీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న నాగమణిని ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా నియమించారు.
పూర్తిస్థాయి బాధ్యతలు గల సబ్ రిజిస్ట్రార్ లేకపోవడంతో వివిధ రిజిష్ట్రేషన్ల నిమిత్తం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయానికి వస్తున్న ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.
ఫీజ్ టు ఫీజ్ షరా మామూలే
ఇక నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుండి ఫీజ్ టు ఫీజ్ పేరిట వసూళ్లు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈసీలు, నకళ్ళు కావాలన్నా కార్యాలయంలో ఏ పని జరగాలన్నా చేయి తడపనిదే పనీ కావటం అసాధ్యం అన్న భావన సామాన్య ప్రజల్లో వ్యక్తం అవుతోంది. పలు సందర్భాల్లో ఉన్నతాధికారుల నుండి హెచ్చరికలు వెలువడినా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించినా పరిస్థితిలో మార్పు రాలేదు.
ఇప్పటికైనా స్పందిస్తారా?
అవినీతిని రూపు మాపి, ప్రైవేట్ వ్యక్తుల అధిపత్యానికి అడ్డు కట్ట వేసే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన మంగళగిరి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఇటీవల సి సి కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు.
ఇటువంటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతంలో సమర్ధవంతమైన రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ ను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.