ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గుట్కా విక్రేతలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కాతో బాటు ఇద్దరు ప్రధాన గుట్కా విక్రయదారులపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సిఐ వి. సురేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు అనుమానాస్పద దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. దాంతో అక్రమ గుట్కా విక్రేతల గుట్టు రట్టయింది.
గుట్కా విక్రయిస్తున్న వ్యాపారులపై ఉక్కు పాదం మోపడానికి రంగం సిద్ధం చేసిన పట్టణ పోలీసులు టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక వైపు మరొక వైపు పట్టణ పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతూ భారీగా గుట్కా స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు ఒకటో పట్టణ సిఐ వి. సురేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ లో అనుమానాస్పదమైన అక్రమ్ ట్రేడర్స్ దుకాణంలో తనిఖీలు చేపట్టి ఒక లక్ష ఇరవై వేలు విలువైన నిషేధిత గుట్కా, అంబర్ తంబాకు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఘటనా స్థలంలో అక్రమ్ ట్రేడర్స్ గుమస్తా అఫ్రోజ్ ఖాన్ (28) ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ్ ట్రేడర్స్ యజమాని గుట్కా ప్రధాన సూత్రధారి మహమ్మద్ అక్రమ్ ఘటనా స్థలంలో లేనందున అతనిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడిన నిషేధిత గుట్కా ప్యాకెట్లు, నిందితునికి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.
ఈ తనిఖీల్లో ఒకటో పట్టణ ఎస్సై లు జి. అప్పారావు జాదవ్ గుణవంత రావు, సిబ్బంది కె.రాములు, దశరథ్, వినోద్, రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.