ఉద్యోగం చేసే సమయంలోనే ప్రమోషన్లు రాక చాలా మంది నానా ఇబ్బందులు పడుతుంటే ఒక అధికారికి రిటైర్ అయిన తర్వాత ప్రమోషన్ ఇచ్చేశారు. పదవీ విరమణ చేసి వీడ్కోలు సభ కూడా పూర్తి అయిన తర్వాత ప్రమోషన్ అందుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు ఆంధ్రప్రదేశ్ లోని ఆర్ధిక శాఖ అధికారి ఒకరు. ఇదేదో పొరబాటున జరిగింది కాదు.
ఆయన ‘‘మనకు బాగా కావాల్సిన వాడు’’ అందుకే అవుట్ ఆఫ్ ద వే వెళ్లి మరీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ ‘‘దారుణమైన’’ నిర్ణయం తీసేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి ఎం సి హెచ్ వి మల్లేశ్వరరావు విషయంలో ఇలా జరగడంతో ఎంతో మంది ముక్కున వేలేసుకున్నారు.
మల్లేశ్వరరావు అనే ఈ అధికారి రిటైర్ అయిన తర్వాత స్పెషల్ సెక్రటరీ పోస్టు ఇచ్చేశారు. ఇది ఐఏఎస్ అధికారులకు ఇచ్చే పోస్టు. అయినా సరే మల్లేశ్వరరావుకు ఇచ్చి పంపించారు. దీంతో ఆయనకు నెలకు కనీసం 15 వేల నుంచి 25 వేల రూపాయల వరకు నెలవారీ పెన్షన్ పెరుగుతుంది.
పదవిలో ఉండి ప్రమోషన్ తీసుకుని పెన్షన్ తీసుకుంటే ఫర్వాలేదు కానీ, అక్రమ మార్గంలో కూడా పెన్షన్ తీసుకోవచ్చునని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. మల్లేశ్వరరావు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.
అంతే కాదు ఆ శాఖ కార్యదర్శికి కూడా తలలో నాలుక లాంటి వాడట. దాంతో రిటైర్ అయిన తర్వాత కూడా మహర్దశ పట్టించారు. ఎంతో గుంభనంగా జరిగిన ఈ సంఘటన తెలియడంతో ఏపి సచివాలయంలో ఒక్క సారిగా అందరూ అవాక్కయ్యారు.