పవిత్రమైన ఒక గొప్ప సందేశం ఇచ్చే భగవద్గీతను శవయాత్రలలో వినిపించడమనేది అపచారమని తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య వెల్లడించింది. ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన పొరపాటును ఇప్పటికైనా సరిదిద్దుకుందామని సమాఖ్య కోరింది.
ప్రతి జీవి తమ తమ కర్మలను ధర్మబద్ధంగా నిర్వహించే ఆవశ్యకతను, అదే విధంగా వాటి వలన కలిగే పరిణామాలను కూడా భగవద్గీత తెలియచేస్తుందని వారన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అందించిన పవిత్ర సందేశమే భగవద్గీత అని ఇలాంటి మహిమాన్విత గ్రంధరాజాన్ని నిత్యం పఠించాలని సమాఖ్య కోరింది. కనీసం విన్నా అనంతమైన సుఖ సంతోషాన్ని ఆనందాన్ని పొంద గలుగుతారు.
అంతే కాకుండా తెలిసి తెలియక చేసిన అనేక పాపాలను, దోషాలను శాశ్వతంగా హరించ గల మహిమాన్వితమైనదని వారన్నారు. ఇంతటి శక్తివంతమైన సందేశాన్ని శవం దగ్గర వినిపించే సాంప్రదాయాన్ని వదిలేయాలని వారు కోరారు.
ఇప్పటికే రాష్ట్రమంతటా ఒక ఉద్యమంలా అనేక రకాలుగా కార్యచరణ ప్రారంభంచామని రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర రావ్ సిద్దాంతి, ముఖ్య సలహాదారు బోర్పట్ల హన్మంతాచారి, రాష్ట్ర కోశాధికారి సముద్రాల విజయ సారథి తెలిపారు.