కేంద్రo,రాష్ట్రo లో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఇరువురు ఎన్నికలకు ముందు కార్మిక లోకానికి అనేక హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఏ ఒక్క హామీని నెరవేర్చ లేదని సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు అన్నారు. కడప నగరంలో ఏఐటీయూసీ రాష్ట్ర సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్మికుల జీవితాలను మరింత పేదరికంలోకి, దరిద్రం వైపుగా నెట్టివేయబడేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఓబులేసు విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న వివిధ స్కీమ్ వర్కర్లకు స్వయంగా తానే వాగ్దానాలు చేసి తానే తప్పుతున్నాడని ఆశా వర్కర్లకు 16,000 జీతం ఇస్తానని జి ఓ కూడా విడుదల చేసి అమలు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నాడని, అంగన్వాడి కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని నమ్మబలికి తెలంగాణ ప్రభుత్వం 13 వేల రూపాయలు జీతం ఇస్తా ఉంటే మన రాష్ట్రంలో 11,500 మాత్రమే ఇస్తున్నాడని అన్నారు.
అవి కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు బిల్లులు మూడు, నాలుగు మాసాలకు విడుదల చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తక్షణమే వారికి ఇస్తున్నటువంటి జీతం 3 వేల నుంచి 10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నరేంద్ర మోడీ ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి శిరస్సు వంచి అమలుపరుస్తున్నాడని ప్రజలు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రైవేటీకరణ చేసి తీరుతాం అని ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఖండించకుండా నరేంద్ర మోడీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడని అన్ని ఓడరేవులు నరేంద్ర మోడీ ఆదేశంతో ఆదానికి కట్టబెట్టే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి నిమగ్నమై ఉన్నాడని వారు తీవ్రస్థాయిలో విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు చేస్తున్నటువంటి అన్యాయాలని ధైర్యంగా ప్రశ్నిస్తున్నటువంటి అమరావతి జేఏసీకి ఏఐటియుసి రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారు రూపొందించబోయేటువంటి కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంలో ఏఐటీయూసీ నాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా క్రియాశీలంగా పనిచేస్తారని వారు తెలియజేశారు. కార్మిక వర్గాన్ని పోరాటాలకు సిద్ధం చేసే విధంగా యువ కార్మిక సమ్మేళనాలు, విద్యా, వైద్యానిక, సిద్ధాంతిక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.
ఈ రాష్ట్ర సమితి సమావేశాలు అన్ని విభాగాల నాయకులు వారి సమస్యలపై చర్చించి రాబోయే సంవత్సర కాలం పోరాట కాలంగా రూపొందిస్తున్నామని కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించి వారి యొక్క న్యాయమైన కోర్కెలను సాధించేంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడేంతవరకు పెద్ద ఎత్తున ఇతర కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలకు సిద్ధమవుతున్నామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవద్యక్షులు రాధాకృష్ణ మూర్తి, రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, డిప్యుటీ జనరల్ సెక్రెటరీ వెంకటసుబ్బయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ చలాసాని రామారావు, కోశాధికారి కొండల్ రావు, రాష్ట్ర కార్యదర్శులు పడాల రమణ, రమేష్, సుబ్బారాయుడు, ఏఐటీయూసీ కడప జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్, నాగసుబ్బారెడ్డి లు జిల్లా డిప్యూటీ కార్యదర్శి బాధుల్లా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున, కడప నగర ప్రధాన కార్యదర్శి ఉద్దె.మద్దిలేటి, జిల్లా కార్యదర్శులు మస్తాన్, చాంద్ బాషా, నగర అధ్యక్షుడు పిచ్చినేని సుబ్బారాయుడు. తదితరులు పాల్గొన్నారు.