పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం లోని గట్టయ్య సెంటర్ మీదుగా బైపాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పెంచిన అన్నిరకాల ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు వెయిట్ చేసి ఎన్నికలు పూర్తయిన మరుక్షణమే గ్యాస్ పెట్రోల్ డీజిల్ చార్జీలపై అదనపు భారాన్ని మోపడం అన్యాయమన్నారు.
కరోనా నేపథ్యంలో ప్రజల ఆదాయాలు సన్నగిల్లుతున్నాయని, ధరలు పెరగటంతో పేద మధ్య తరగతి చెందిన వారు అల్లాడిపోతున్నారన్నారు. వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంపిణీ కాకుండా కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను అప్పనంగా అప్పజెప్పడం ఏమిటని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో అన్ని రకాల ధరలు తగ్గుతుంటే దేశంలో మాత్రం అన్ని రకాల ధరలు కేంద్రం పెంచుతుందని విమర్శించారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం అసహనం ప్రజలకు అందుబాటులో ఉన్నాయని నిత్యావసర సరుకులు గ్యాసు పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేకుండా పైపైకి పోతున్నాయని విమర్శించారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలు ఉద్యమించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామయ్య, ఆవుల అశోక్, నాయకులు ఝాన్సీ, రామారావు, కే శ్రీను , చందు, వెంకటేష్, చీరాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు