లాక్ డౌన్ లో ఆర్థిక లోటుపాట్లతో వ్యధ చెందుతున్న సాధారణ ప్రజలకు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా అదనపు కరెంటు బిల్లులు సతమతం చేస్తున్నాయని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి అన్నారు.
3 నెలలుగా గణించని కరెంటు బిల్లులను ఒకే మారు గణించి అదనపు శ్లాబ్ విధానంలో 200 యూనిట్లు కాల్చిన ప్రతి వినియోగదారుడికి యూనిట్ కు 7.25 పైసలు చొప్పున వసూలు చేయడం వల్ల వేల రూ.ల కరెంటు బిల్లులు వస్తున్నాయని ఆయన అన్నారు.
కరెంటు బిల్లులను పట్టుకుంటే పేదలకు షాక్ కొడుతోందని, ఈ స్థితిలో అదనంగా పెంచలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యుత్ శాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డి సెలవివ్వడాన్ని ప్రజలు అంగీకరించడం లేదని ఆయన అన్నారు. తక్షణం ఈ బిల్లులను రద్దు చేయకపోతే 2000 సంవత్సరంలో సాగిన విద్యుత్తు పోరాటం లాగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని, చిట్యాలలో హైవోల్టేజీతో తగులబడిన ఎలక్ట్రానిక్ వస్తువులకు విద్యుత్ శాఖ నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈరోజు చిట్యాల కరెంటు బిల్లుల వసూలు కేంద్రం ముందు మున్సిపాలిటీ పరిధిలో హైవోల్టేజీ వలన తగులబడిన టీవీలను ఎలక్ట్రానిక్ వస్తువులను కుప్పగా పోసి బాధితులందరూ ఆఫీసు ముందు బైఠాయించారు. విపరీతంగా పెరిగిపోయిన బిల్లుల వసూళ్లను నిలిపివేయాలని ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు సంఘీభావం తెలియచేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు, యూత్ కాంగ్రెస్ నాయకులు కొమ్ము యాదయ్య లు పాల్గొని మాట్లాడారు. ఈ ధర్నాలో నాయకులు నాగిళ్ళ యాదయ్య, పోశబోయిన నరసింహయాదవ్, పాల వెంకట్, బాణోతు నితిన్ నాయక్, మారగోని శ్రీనివాస్ గౌడ్, ఎన్నమళ్ళ పృథ్వీరాజ్, ముప్పిడి మారయ్య లతో పాటు బాధిత ప్రజలు పాల్గొన్నారు.